ఆహారంలో పోషకాలు ఉండటం చాలా అవసరం. తేలికపాటి అల్పాహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది. మధ్యాహ్న భోజనం పప్పు, కూరలతో నిండుగా ఉండాలి. ఓ మోస్తరుగా రాత్రి డిన్నర్ ప్లాన్ చేసుకోవాలి. ఇవన్నీ మాకు తెలుసులే అంటారా! మంచిదే!! కానీ, ఈ పోషకాలు ఏ సమయంలోగా తీసుకోవాలో తెలిసినప్పుడే ఆరోగ్యానికి శ్రీరామ రక్ష అని గుర్తుంచుకోండి.
రోజులో అల్పాహారం చాలా ముఖ్యమైన భాగం. సుదీర్ఘ సమయం తర్వాత తీసుకునే ఆహారమిది. బ్రేక్ఫాస్ట్ సరిగ్గా ఉంటేనే శరీరం ఆ రోజు పనికి ఉత్సాహంగా సిద్ధమవుతుంది. ఉదయం నిద్ర లేచిన తర్వాత గంటలోపు అల్పాహారం తీసుకోవడం చాలా మంచిది. సమయం ప్రకారం.. ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య టిఫిన్ చేయాలి. అప్పుడే అది ఒంట బడుతుంది. ఎప్పుడైనా ఆలస్యమైతే ఓకే! ఎట్టి పరిస్థితిల్లోనూ ఉదయం పది గంటల లోపు బ్రేక్ ఫాస్ట్ ముగించాలని గుర్తుంచుకోండి. బ్రేక్ఫాస్ట్లో కాయగూరలు, పండ్లు ఉండేలా చూసుకోవాలి. ప్రొటీన్లు సమృద్ధిగా అందాలి.
అల్పాహారం తీసుకున్న నాలుగు గంటల తర్వాత భోజనానికి సరైన సమయం. ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నం 12 నుంచి 1.30 గంటల మధ్య భోజనం చేయాలి. ఆ సమయంలో శరీరం మంచి ఆకలి మీద ఉంటుంది. అప్పుడు తినే ప్రతి ముద్దా… శరీరానికి శక్తినిస్తుంది. భోజనంలో కూరగాయలు, లీన్ ప్రొటీన్స్, కాంప్లెక్స్ పిండిపదార్థాలు ఉండేలా చూసుకోవాలి.
రాత్రి నిద్రకు ఉపక్రమించడానికి రెండు గంటల ముందు డిన్నర్ చేసేలా చూసుకోవాలి. చీకటి పడినప్పుడు శరీర గడియారం చురుగ్గా మారుతుంది. మెలటోనిన్ స్థాయులు పెరుగుతాయి. పాంక్రియాస్ కార్యాచరణ కూడా తగ్గుతుంది. పడుకోవడానికి పది నిమిషాల ముందు భోజనం చేస్తే… రక్తంలో చక్కెర పెరుగుతుంది. జీవక్రియలు కూడా మందకొడిగా సాగుతాయి. ఇది అధిక బరువుకు కారణం అవుతుంది. అందుకే, రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్య డిన్నర్ చేస్తే.. మీరే విన్నర్.