కేసముద్రం, జూన్ 28 : కేసముద్రం విలేజ్ గ్రామంలోని రైస్ మిల్లుల్లో సివిల్ సప్లయ్, విజిలెన్స్, టాస్క్ఫోర్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.30కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. సివిల్ సప్లయ్ డీఎం కృష్ణవేణి కథనం ప్రకారం.. మణికంఠ రైస్మిల్లులో 12,360 క్వింటాళ్లు, వీటి విలువ సుమారు రూ. 3కోట్ల79 లక్షలు, మారుతి రైస్ మిల్లులో 43,464 క్వింటాళ్ల ధాన్యం, వీటి విలువ సుమారు రూ.13కోట్ల 80 లక్షలు, మహదేవ రైస్ మిల్లులో 58,070 క్వింటాళ్ల ధాన్యం, వీటి విలువ సుమారు రూ.12కోట్ల79 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మూడు మిల్లుల్లో కలిపి సుమారు రూ.30కోట్ల విలువైన ధాన్యం మాయమైనట్లు తెలిపారు. ప్రభుత్వానికి బియ్యం అందించకపోవడం, మిల్లుల్లో ధాన్యం నిల్వలు లేకపోవడంతో యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు. కేసముద్రంలో మరికొన్ని మిల్లుల్లో సీఎంఆర్ ద్వారా ప్రభుత్వానికి బియ్యం అందించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
కాగా, రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సేకరించింది. ఈ ధాన్యాన్ని అధికారులు కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలిస్తారు. మిల్లుల్లో మర ఆడించి వచ్చిన బియ్యాన్ని తిరిగి సివిల్ సప్లయ్ అధికారులకు (ప్రభుత్వానికి)అందించాలి. అయితే, కొంతమంది వ్యాపారులు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యంలో కొంత మేర ధాన్యాన్ని ఇతర రాష్ర్టాలకు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. రేషన్ బియ్యాన్ని లబ్ధిదారుల నుంచి కేజీకి రూ.5 నుంచి రూ.8 వరకు తక్కువ ధరకు కొని సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్)విధానం ద్వారా తిరిగి సివిల్ సప్లయ్ గోదాములకు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. రేషన్ బియ్యాన్ని రీ సైక్లింగ్ చేస్తూ మిల్లర్లు సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు అధికారులు రెండు రోజుల నుంచి కేసముద్రం మిల్లుల్లో తనిఖీలు చేపడుతున్నారు.