కాజీపేట, ఆగస్టు 4 : ఉత్తర, దక్షిణ భారతానికి ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ సమీపంలోని కోమటిపల్లి వద్ద భూగర్భంలో రైళ్ల ప్రయాణానికి నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. దాదాపు 350 మీటర్ల మేర సొరంగ మార్గం నిర్మిస్తుండగా, ఆగస్టు చివరలో ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. సెప్టెంబర్లో రైళ్లు పట్టాలెక్కనుండడంతో రైళ్ల క్రాసింగ్ సమస్య తీరనున్నది. క్రాసింగ్ సమస్య లేకుండా రైళ్లను నడపాలనే సంకల్పంతో రైల్వే శాఖ కాజీపేట-బల్లార్షా మార్గంలో కోమటిపల్లి-వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ సమీపంలో దాదాపు రూ. 32 కోట్లతో భూగర్భంలో సొరంగ మార్గం నిర్మిస్తున్నది.
దేశం లో అత్యంత రద్దీగా ఉండే మార్గాల్లో కాజీపేట ఒకటి. ఢిల్లీ వైపు నుంచి వచ్చే రైలు మార్గం వడ్డేపల్లి చెరువు దగ్గరకు రాగానే ‘వై’ ఆకారంలో రెండుగా చీలుతుంది. సికింద్రాబాద్ వెళ్లే రైళ్లు కాజీపేట మీదుగా, విజయవాడ మార్గంలోని రైళ్లు వరంగల్ స్టేషన్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి. మూడు వైపులా రైళ్ల రాకపోకలతో వడ్డేపల్లి చెరువు ప్రాంతంలో రైల్వే ట్రాక్ రద్దీగా ఉంటుంది. ముఖ్యంగా వరంగల్ వైపు గూడ్స్ రైళ్లు వెళ్లేంత వరకు.. ఢిల్లీ, బల్లార్షా వైపు నుంచి కాజీపేట, సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికుల రైళ్లను వడ్డేపల్లి చెరువు ప్రాంతం (కాజీపేట ఔటర్)లో నిలిపివేస్తున్నారు. దీంతో ప్రయాణం ఆలస్యమవుతోంది.
బల్లార్షా నుంచి కాజీపేట, వరంగల్ వైపు రైళ్లు వెళ్లేందుకు ‘వై’ ఆకారంలో ట్రాక్ నిర్మాణం చేపడుతున్నారు. హసన్పర్తి రోడ్ నుంచి వరంగల్ వైపునకు వెళ్లే రైళ్లు భూమి ఉపరితలం నుంచి, కాజీపేట, సికింద్రాబాద్ వైపు వెళ్లే రైళ్లు కోమటిపల్లి వద్ద నిర్మాణం చేపట్టిన భూగర్భం (టన్నెల్)లోకి ప్రవేశిస్తాయి. కోమటిపల్లి దగ్గర రైళ్లు మెల్లమెల్లగా కిందికి దిగుతూ 350 మీటర్లు భూగర్భంలో ప్రయాణం చేసి ఆ తర్వాత పైకి వెళ్తూ వడ్డేపల్లి చెరువు దగ్గర భూ ఉపరితల స్థితికి చేరుకుంటుంది. దీంతో రైళ్ల క్రాసింగ్ సమస్య తీరనుంది. బైపాస్ పనులు పూర్తయితే హసన్పర్తి రోడ్ నుంచి అటు వరంగల్ వైపు, ఇటు కాజీపేట వైపు రైళ్లను ఒకేసారి పంపించవచ్చునని అధికారులు అంటున్నారు.
రైలు సొరంగ మార్గం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం టన్నెల్లో రైలు పట్టాల నిర్మాణం, ఎలక్ట్రిక్ ఇంజిన్తో నడిచేందుకు వీలుగా విద్యుదీకరణ పనులు చేపడుతున్నారు. టౌన్ రైల్వే స్టేషన్ సమీపంలో జరుగుతున్న బైపాస్ పనులకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆగస్టు నెల చివరలో భూగర్భ మార్గం పూర్తవుతుందని, ట్రయల్ రన్ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సెప్టెంబర్ మొదటి వారంలో సొరంగ మార్గం గుండా రైళ్లు పూర్తిస్థాయిలో పట్టాలెక్కే అవకాశమున్నట్లు వారు పేర్కొన్నారు.