సుబేదారి, జూన్ 30 : ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ తన కక్కుర్తి బుద్ధిని బయటపెట్టుకున్నాడు. తమకు న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన బాధితులకు చుక్కలు చూపిస్తున్నాడు. ‘చెప్పినట్లు వింటారా.. లేకపోతే పట్టుకొచ్చి లోపలేయాలా’ అంటూ బెదిరిస్తుండడంతో బాధితులు గజగజా వణికిపోతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ సెంట్రల్ జోన్ పరిధిలో ఓ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న స్టేషన్ ప్రాంతంలో ఒక స్వర్ణకారుడు బంగారు ఆభరణాల తయారీ షాపు నిర్వహిస్తున్నాడు. ఇటీవల చాలామంది కస్టమర్ల నుంచి పెద్దమొత్తంలో గోల్డ్ తీసుకున్నా డు. ఈ క్రమంలోనే హనుమకొండ జిల్లా కమలాపూర్కు చెంది న ఓ బాధితుడు తనకు చాలాకాలం నుంచి పరిచయమున్న సదరు స్వర్ణకారుడికి కొద్ది రోజుల క్రితం రూ.7లక్షలకు పైగా విలువ చేసే 85 గ్రాముల గోల్డ్ బిస్కెట్ కాయిన్ ఇచ్చి రసీదు తీసుకున్నాడు. అయితే ఇటీవల ఆ స్వర్ణకారుడు బంగారంతో పరారయ్యాడు. విషయం తెలిసిన బాధితులు అతడి షాపు వద్దకు వెళ్లి సిబ్బందిని నిలదీశారు. కమలాపూర్కు చెందిన బాధితుడు కూడా షాపునకు వెళ్లి సిబ్బందిని నిలదీయగా పాత పరిచయం ఉండడంతో 50 గ్రాముల బంగారం అతడికి ఇచ్చారు.
ఇదే సమయంలో మరికొంత మంది బాధితులు తమకు న్యాయం చేయాలని స్థానిక ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేయడంతో పరారైన స్వర్ణకారుడి వద్ద పనిచేసే సిబ్బందిని విచారణ కోసం ఇన్స్పెక్టర్ స్టేషన్కు పిలిపించి ఎంతమంది వద్ద ఎంతెంత బంగారం తీసుకున్నారు? ఎవరెవరికి ఇచ్చారు? అనే వివరాలు తెలుసుకున్నట్లు సమాచారం. అనంతరం బాధితులకు ఫోన్ చేసి ‘మీరు తీసుకున్న బంగారం తిరిగి ఇవ్వాలి’ అని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగా కమలాపూర్కు చెందిన బాధితుడికి ఇన్స్పెక్టర్ ఫోన్ చేసి తీసుకున్న 50 గ్రాముల బంగారం తీసుకొచ్చి ఇవ్వాలని బెదిరించాడు. దీంతో బాధితుడు ‘నేను ఇచ్చిన 85 గ్రాముల బంగారంలో నాకు ఇచ్చింది 50 గ్రాములే.. ఇంకా 35 గ్రాముల బంగారం రావాలి.. రసీదు, ఫోన్ కాల్స్ రికార్డ్సు ఉన్నాయి సార్’ అని మొరపెట్టుకున్నా ఆ ఇన్స్పెక్టర్ వినలేదని తెలిసింది. ‘స్టేషన్కు వస్తావా? రావా?.. లేదంటే పట్టుకొచ్చి లోపలేస్తా’..అని బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. దీంతో బాధితుడు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, పరారైన స్వర్ణకారుడి నుంచి బంగారం ఇప్పిస్తానని ఆ ఇన్స్పెక్టర్ కొంతమంది బాధితుల నుంచి డబ్బులు కూడా తీసుకున్నట్లు తెలుస్తున్నది.