వరంగల్, డిసెంబర్ 7: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న బస్తీ దవాఖానల ఏర్పాటులో వేగం పెంచాలని సీడీఎంఏ డాక్టర్ సత్యనారాయణ గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో బుధవారం ఆయన వీడి యో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది అంశాలతో ఏర్పాటు చేసిన టెన్ పాయింట్స్ ప్రోగ్రాం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు ప్రతి ఉద్యోగి తన పరిధిలోని అంశాలపై దృష్టి సారించాలన్నారు. వ్యర్థాల ప్రాసెసింగ్ యూనిట్ల పనితీరుపై నిరంతరం పర్యవేక్షించాలన్నారు. మున్సిపాలిటీల పరిధిలో చేపట్టిన సమీకృత వెజ్, నాన్వెజ్ మార్కెట్ల నిర్మాణ పనులు, వైకుంఠధామాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు.
హరితహారం కార్యక్రమంలో భాగంగా నగరంలోని ప్రధాన రోడ్ల మధ్య, ఇరువైపులా మల్టీ త్రీలేయర్ విధానంలో మొక్కలు నాటాలన్నారు. టీఎస్ బీపాస్ గృహ నిర్మాణ దరఖాస్తుల్లో పెండింగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. సమీక్షలో ఉప కమిషనర్లు రవీందర్యాదవ్, అనిసుర్ రషీద్, శ్రీనివాసరెడ్డి, సిటీ ప్లానర్ వెంకన్న, ఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, డీఈ ఇష్రత్ జహ, ఆర్వో షహజాది బేగం పాల్గొన్నారు.