సర్కారు పాఠశాలలపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోంది. మౌలిక వసతుల కల్పన దేవుడెరుగు.. విద్యార్థులకు ప్రధానమైన రవాణా సౌకర్యం కల్పించడంలో ఘోరంగా విఫలమ వుతున్నది. చదువుకునేందుకు గ్రామాలు, మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లడానికి తగినన్ని బస్సులు లేక స్టూడెంట్స్ పడరాని పాట్లు పడుతున్నారు. కాలినడకన, సైకిళ్లపై కిలోమీటర్ల దూరం వెళ్లి వస్తున్నారు. కొంతమంది ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ప్రమాదమని తెలిసినా ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. కూర్చోవడానికి స్థలం లేక ఆటోల వెనుక నిలబడి వెళ్తున్నారు. ప్రధాన రహదారిపై ఉన్న గ్రామాలకు తప్ప మిగతా మారుమూల పల్లెలకు పాఠశాలలు ప్రారంభమై నప్పటి నుంచి బస్సులు నడపడం లేదని ఆరోపిస్తున్నారు. ఆయా రూట్లలో కూడా సమయానికి బస్సులు రాక.. వచ్చినా విద్యార్థులు, మహిళలను చూసి ఆపకుండా వెళ్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవాణా సౌకర్యం లేక.. తమ పిల్లల బాధలు చూడలేక తల్లిదండ్రులు దూరమైనా వసతి గృహాల్లో ఉంచి చదివించుకుం టున్నారు. మరికొందరు ఆర్థిక భారమైనా ప్రైవేట్ హాస్టళ్లలో ఉంచుతున్నారు. ఇదే సమయంలో పల్లెలకు వస్తున్న ప్రైవేట్ పాఠశాలల బస్సులను చూసి పలువురు తల్లిదండ్రులు ఆకర్షితులవుతు న్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోతున్నదనే వాదన వినిపిస్తున్నారు. కాగా, రద్దీ రూట్లలో అదనపు ట్రిప్పులు తిప్పుతున్నామని ఆర్టీసీ అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బస్సులు లేక బడికిపోయే విద్యార్థులు ఎదుర్కొంటున్న కష్టాలపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం..
మహబూబాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ) : మహబూబాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల్లో మొత్తం 633 గ్రామాలున్నాయి. ఇందులో కేవలం 241 గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉండగా, మిగిలిన 392 గ్రామాలకు బస్సులు రాక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాలినడకన, సైకిళ్లపై, ప్రైవేట్ ఆటోల్లో విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు చేరుకుంటున్నారు. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని బస్సులు నడపాలని విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. బస్సు సౌకర్యం లేక ఆయా గ్రామాలు, మండల కేంద్రాల్లోని తెలంగాణ మోడల్ స్కూల్, జడ్పీ ఉన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రమాదమని తెలిసినా ఆటోల్లో కిక్కిరిసి ప్రయాణిస్తున్నారు. అంతేకాకుండా దూరాన్ని బట్టి నెలకు రూ. 700 నుంచి రూ. 1000 వరకు తమపై ఆర్థిక భారం పడుతున్నదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలికలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉన్నా పల్లెలకు బస్సులు రాక ప్రైవేట్ వాహనాల్లోనే వెళ్లాల్సి వస్తున్నది. కాగా, జిల్లాలోని తొర్రూరు, మహబూబాబాద్లో బస్ డిపోలుండగా, వీటి పరిధిలో మొత్తం 159 బస్సులు నడుస్తున్నాయి. ఇందులో 98 పల్లె వెలుగు, 51 ఎక్స్ప్రెస్లు, 6 సూపర్ లగ్జరీ, 4 డీలక్స్ బస్సులు ఉన్నాయి. ఉన్న అరకొర బస్సులతో జిల్లా వ్యాప్తంగా అన్ని రూట్లలో బస్సులు నడపడం సాధ్యం కాదని ఆర్టీసీ అధికారులే చెబుతున్నారు. ఉన్న బస్సులను పకడ్బందీగా నడుపుతున్నామని, మరికొన్ని బస్సులు కావాలని ప్రతిపాదనలు పంపినట్లు మహబూబాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ శివప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం బస్సులు నడుస్తున్న రూట్లలో విద్యార్థులు బస్సులను వినియోగించుకుంటున్నారని, ఇంకా చాలా రూట్లలో నడపాలని ఆయన పేర్కొన్నారు.
నర్సింహులపేట : నేను మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న. రోజూ ఆటోలోనే స్కూల్కు పోతున్న. మానాన్న నెలకు రూ. 700లు ఆటోకు ఇస్తున్నడు. మా ఊరి నుంచి బస్సు సౌకర్యం ఉంటే ఏడాదికి రూ. 7000లు మిగిలేవి. పాఠశాల సమయానికి బస్సు నడిపిస్తే నాలాంటోళ్లందరికీ బాగుంటుంది. – మంచాల తేజశ్రీ, 8వ తరగతి, పడమటిగూడెం
డోర్నకల్ : పాఠశాలకు వచ్చేందుకు అధికారులు బస్సు ఏర్పాటు చేయాలి. బస్సులు లేక నెలకు రూ. 500 చెల్లించి ఆటోలో వస్తున్నం. వానకాలంలో, పరీక్షల సమయంలో పాఠశాలకు వచ్చేందుకు ఆలస్యమవుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి బస్సు సౌకర్యరం కల్పించాలి.
నల్లబెల్లి : కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం పెట్టి పల్లెల్లోకి వచ్చే పల్లె వెలుగు బస్సులను నిలిపేసింది. నిరుపేదలకు ఫ్రీ ఓకే గానీ, లక్షల జీతం తీసుకునే ఉద్యోగులకు ఉచితం ఎందుకు? ఇప్పుడు ఇంటర్, డిగ్రీ చదువుల కోసం పట్టణాలకు వెళ్లాలంటే విద్యార్థులు అరిగోస పడుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పల్లెల్లోకి బస్సులను నడిపి, విద్యార్థులకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించాలి.
ములుగు, జూలై 2 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లాలో ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సు డిపో లేకపోవడం వల్ల సగానికి పైగా గ్రామాలకు బస్సులు వెళ్లడం లేదు. జాతీయ రహదారి వెంట ఉన్న గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం ఉంటుంన్నది. ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉన్న జిల్లాలోని మారుమూల గ్రామాలకు నష్టాల పేరుతో ఆర్టీసీ అధికారులు బస్సులను నడపకపోవడంతో మండల, జిల్లా కేంద్రంలోని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. జిల్లాలో గతేడాది 3,680 మంది విద్యార్థులకు ఆర్టీసీ అధికారులు బస్పాస్లు మంజూరు చేశారు. ప్రస్తుతం మహిళలకు ఉచిత బస్సు కారణంగా ఇప్పటి వరకు 620 మంది బాలురకు మాత్రమే బస్సు పాసులు ఇచ్చినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. పూర్తి స్థాయిలో కళాశాలలు, పాఠశాలలు ప్రారంభమైన తర్వాత మరిన్ని పాస్లు ఇవ్వనున్నట్లు చెప్పారు. కాగా, అనువైన సమయంలో బస్సులు లేకపోవడం, కొన్ని కారణాలతో బస్సులు నడవకపోవడం వల్ల విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఎక్కువగా ఆటోల్లో విద్యార్థులు ప్రయాణిస్తూ కళాశాలలు, పాఠశాలలకు చేరుకుంటున్నా రు. కొన్ని గ్రామాల విద్యార్థులు నెలవారీ కిరాయికి ఆటోలను మాట్లాడుకుంటున్నారు. ములు గు జిల్లాలో బస్సు డిపో లేకపోవడం వల్ల జిల్లా కేంద్రం నుంచి 50 కిలో మీటర్లు, ఏటూరునాగా రం నుంచి 110 కిలో మీటర్ల దూరంలోని హనుమకొండ నుంచి బస్సులు నడపడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. జిల్లాలో వరంగల్-2, నర్సంపే ట, పరకాల, మణుగూరు, భద్రాచలం, భూపాలపల్లి డిపోల నుంచి ప్రతిరోజూ 230-240 ట్రి ప్పుల బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. అయినప్పటికీ మారుమూల గ్రా మాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు.
హనుమకొండ చౌరస్తా, జూలై 2 : బస్సుల కొరత, సమయానికి సరిపడా రాక హనుమకొండ జిల్లాలోని పలు గ్రామాల నుంచి పట్టణాలకు వస్తున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. పదోతరగతి, ఇంటర్, డిగ్రీ చదివే పేద విద్యార్థులకు ఆర్టీసీ బస్సు తప్ప మరో మార్గం లేదు. సొంత వాహనాలు లేక, అధిక చార్జీలు చెల్లించి పాఠశాలలు, కాలేజీలకు వెళ్లలేక కొందరు ఇంటికే పరిమితమవుతున్నారు. పాసులున్నా బస్సులు లేకపోవడం, పాసులకు పరిమితులు విధించడంతో ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు విద్యార్థులు, మహిళలు ఉన్న స్టేజీల వద్ద డ్రైవర్లు బస్సులు ఆపకుండా వేగంగా వెళ్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పాఠశాల, కాలేజీ విద్యార్థులు అనేక పాట్లు పడుతున్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపడంలేదు. వచ్చిన అర కొర బస్సుల్లో కిక్కిరిసిన ప్రయాణికులతో ఊపిరాడకుండా ప్రయాణం చేస్తున్నామని వారు వాపోతున్నారు. కనీసం నిలబడేందుకు కూడా అవకాశం ఉండటంలేదని అంటున్నారు. బస్సులో 100కు పైగా విద్యార్థులు ఉంటున్నారని, ప్రమాదమని తెలిసినా ఫుట్బోర్డు ప్రయాణం చేయాల్సి వస్తున్ననదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాఠశాలలు, కళాశాలలకు ఆలస్యంగా వెళ్తున్నామని చెప్తున్నారు. ఉదయం ఎలాగోల పాఠశాల, కాలేజీకి వెళ్లినప్పుటికీ సాయంత్రం ఇంటికి రావడం ఆలస్యమవుతుందని అంటున్నారు. బస్సుల కోసం పడిగాపులు కాస్తూ వాటి వెనుక పరుగులు తీస్తున్నామని వాపోతున్నారు. హనుమకొండ బస్టాండ్, చౌరస్తా, ఏనుగులగడ్డ, పెట్రోల్ పంపు వద్ద సాయంత్రం బస్సుల కోసం గంటల కొద్దీ వేచి చూడాల్సి వస్తున్నదంటున్నారు. ఆయా రూట్లలో బస్సుల సంఖ్యను పెంచాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
కొన్ని ప్రాంతాలకు బస్సుల కొరత ఉన్నది వాస్తవమే. అయినప్పటికీ అన్ని బస్సులను సమయానికి నడుపుతున్నాం. గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే విద్యార్థులకు ఉదయం, సాయంత్రం కొంత సమస్య ఉండడంతో అదనపు బస్సులు తిప్పుతున్నాం. విద్యార్థులు, మహిళలు ఉన్నచోట బస్సులు ఆపకుండా వెళితే చర్యలు తీసుకుంటాం.
జయశంకర్ భూపాలపల్లి, జూలై 2 (నమస్తే తెలంగాణ) : భూపాలపల్లి జిల్లాలో 69 జడ్పీహెచ్ఎస్, 6 మోడల్ స్కూల్స్, 319 ప్రాథమిక పాఠశాలలు, 44 యూపీఎస్లు ఉండగా మొత్తం 20,800 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. జిల్లాలోని ఆయా గ్రామాలు, మండల కేంద్రాల్లోని పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అనేక మంది ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మంది కాలినడకనే వెళ్తుండగా, పలువురు సైకిళ్లపై చేరుకుంటున్నారు. టేకుమట్ల మండలంలోని సుబ్బక్కపల్లి విద్యార్థులు ఏకంగా ఏడు కిలోమీటర్లు నడిచివెళ్తున్నారు. రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతున్నది. ఇదే సమయంలో ప్రతి ఊరిలో ప్రైవేట్ పాఠశాలల బస్సులు తిరుగుతుండడంతో ఆర్థికభారమైనా తల్లిదండ్రులు తమ పిల్లలను వాటిలో చేర్పించేందుకు మొగ్గుచూపుతున్నారు. కొంతమంది వసతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసిస్తుండగా, మరికొంత మంది ప్రైవేట్ హాస్టళ్లను ఆశ్రయిస్తున్నారు. పలిమెల మండలంలో ప్రభుత్వ పాఠశాలలు లేకపోవడం, రవాణా సౌకర్యం కరువై విద్యార్థులు మహదేవపూర్ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ చదువుకుంటున్నారు. కాగా, జిల్లాలో రవాణా సౌకర్యం లేని విద్యార్థుల కోసం ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఇప్పించేందుకు విద్యాశాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. భూపాలపల్లి మండలానికి చెందిన 90 మంది విద్యార్థులు, చిట్యాల నుంచి 28, కాటారం 54, మహదేవపూర్ 72, మహాముత్తారం 19, మల్హర్ 12, మొగుళ్లపల్లి 28, రేగొండ 119, టేకుమట్ల మండలం నుంచి ఆరుగురు విద్యార్థులు రవాణ సౌకర్యం లేక ప్రైవేటు వాహనాల్లో పాఠశాలలకు వెళ్తున్నారని, వీరికి హాజరుశాతాన్ని బట్టి నెలకు రూ. 600 వరకు అందించాలని ప్రతిపాదించారు.
టేకుమట్లలోని ఉన్నత పాఠశాలలో చదువుకునేందుకు మా సుబ్బక్కపల్లి నుంచి రోజూ నడిచి వెళ్తున్నం. గతంలో పరకాల నుంచి బస్సు వచ్చేది. రోడ్డు బాగా లేక ఇప్పుడు వస్తలేదు. సైకిళ్లు కూడా రిపేర్లు పాడవుతున్నయి. అందువల్ల రోజుకు ఏడు కిలోమీటర్లు నడిచి వెళ్లి చదువుకొని తిరిగివస్తున్నం. వర్షం పడితే రెండు ఒర్రెలు దాటనియ్యవు. అప్పుడు బడి బంద్ పెట్టాల్సిందే. తొందరగా రోడ్డు వేసి, కల్వర్టులు కట్టించి మాకు బస్సు సౌకర్యం కల్పించాలి.
నల్లబెల్లి/చెన్నారావుపేట/నెక్కొండ, జూలై 2 : వరంగల్ జిల్లాలోని పలు గ్రామాలకు పల్లె వెలుగు బస్సులు బంద్ చేయడంతో సర్కారు బడులకు వెళ్లే విద్యార్థులు సైకిల్ యాత్ర చేస్తూ పడరాని పాట్లు పడుతున్నారు. నల్లబెల్లి మండలంలోని ముచ్చింపుల, రంగాపూర్, నందిగామ, రేలకుంట, ధర్మారావుపల్లె, లెంకలపల్లి, కన్నారావుపేట, బుచ్చిరెడ్డిపల్లె, మూడుచెక్కలపల్లె, లైన్తండా, వేదనగర్ తదితర గ్రామాలకు బస్సులు నడవకపోవడంతో ఇంటర్, డిగ్రీ చదివే ఆయా ప్రాంతాల విద్యార్థులు కిలోమీటర్ల దూరం కాలినడకన, సైకిల్పై వెళ్తూ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఉచిత బస్సు సౌకర్యం అమలు చేసినప్పటి నుంచి పల్లెల్లోకి బస్సులు రాక సైకిళ్లపై, కాలినడకన వెళ్తూ ఇబ్బందులు పడుతున్నామని పలువురు విద్యార్థులు వాపోతున్నారు. చెన్నారావుపేట మండలంలోని సూర్యాపేట తండా, గొల్లభామతండా, గొల్లపల్లె, శంకరాంతండా, బాపునగర్తండా, జల్లి తండా, అక్కల్చెడ తండాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో కొందరు విద్యార్థులు నడుచుకుంటూ, మరికొందరు సైకిళ్లపై పాఠశాలలకు వెళ్తున్నారు. మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురవుతున్నారు. రవాణా సదుపాయం ఉంటే తమ పిల్లలను కూడా ప్రభుత్వ బడులకు పంపేవాళ్లమని పలువురు తల్లిదండ్రులు వాపోతున్నారు. నెక్కొండ మండలం సూరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 150 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వీరిలో చిన్నకొర్పోలు, పంతులుతండా, ఔసలితండా, లింగగిరి, శివారు తండాల నుంచి వస్తున్న సుమారు 52 మంది విద్యార్థులకు బస్సు సౌకర్యం లేక, కాలినడకనే పాఠశాలకు వెళ్తున్నారు. ట్రావెలింగ్ అలవెన్స్ కింద ఏటా రూ. 6 వేలు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పుడా సౌకర్యం లేదు. అలాగే పత్తిపాక, బొల్లికొండ, గొట్లకొండ, వాగ్యానాయక్తండా తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బస్సు సౌకర్యంలేక సైకిళ్లు, కాలినడక వెళ్తూ అనేక ఇబ్బందుల నడుమ చదువులను సాగిస్తున్నారు.