వరంగల్, మార్చి 1: స్మార్ట్సిటీ పథకంలో భాగంగా గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా) కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఆమె కమిషనర్ ప్రావీణ్యతో కలిసి సమీక్షించారు. స్మార్ట్సిటీ, బల్దియా, కుడా ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధిపై అధికారులు, కాంట్రాక్టర్లతో చర్చించారు. ప్రస్తుతం నగరంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న స్మార్ట్రోడ్ల పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నగరానికి నాలుగు వైపులా ఏర్పాటు చేస్తున్న గ్రాండ్ ఎంట్రెన్స్ (ముఖ ద్వారాలు) పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. భద్రకాళి బండ్పై ఫుడ్ కోర్టు, మరుగుదొడ్ల ఏర్పాటు, పురోగతిలో ఉన్న గ్రీనరీ, రిటైనింగ్ వాల్, గణేశ్ నిమజ్జన బండ్, అజరా ఆస్పత్రి వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులపై సమగ్రంగా చర్చించారు. ఉర్సు గుట్ట వద్ద గణేశ్ నిమజ్జన బండ్ పనులను త్వరగా చేపట్టాలని ఆదేశించారు. బాలసముద్రం, పోతననగర్ వద్ద రెండో ట్రాన్స్ఫర్ స్టేషన్ల నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. అమ్మవారిపేటలో 5 కేఎల్డీ, 15 కేఎల్డీల ఎఫ్ఎస్టీపీల పనితీరుతోపాటు కొత్తగా నిర్మిస్తున్న 150 కేఎల్డీ సామ ర్థ్యం కలిసి ప్లాంట్ నిర్మాణ పనుల పురోగతిపై ఆమె అధికారులతో సమీక్షించారు.
కమిషనర్ ప్రావీణ్య కాంట్రాక్టర్లతో మాట్లాడారు. మెన్ అండ్ మెటీరియల్ను సమకూర్చుకొని నిర్దేశిత గడవులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు. పూర్తయిన పనులకు వెంటనే బిలులు చెల్లిస్తామని భరోసా ఇచ్చారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు. సమీక్షలో ఎస్ఈ ప్రవీణ్చంద్ర, సిటీ ప్లానర్ వెంకన్న, కుడా పీవో అజిత్రెడ్డి, సీఎంహెచ్వో రాజేశ్, సీహెచ్వో శ్రీనివాసరావు, ఈఈలు రాజయ్య, బీఎల్ శ్రీనివాసరావు, డీసీపీలు ప్రకాశ్రెడ్డి, స్మార్ట్సిటీ ప్రతినిధి అనంద్ వోలేటి పాల్గొన్నారు.