వరంగల్, జూన్ 28 : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాపాలన పేరిట ఆరు గ్యారెంటీల దరఖాస్తులను ప్రజల నుంచి స్వీకరించింది. ఆగమేఘాల మీద ప్రభుత్వం నిర్వహించిన ప్రజాపాలనలో లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. వీటిని వెంటనే ఆన్లైన్ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో బల్దియా అధికారులు ఆదరబాదరాగా చేయడంతో ప్రక్రియ తప్పుల తడకగా మారింది. లక్షల్లో వచ్చిన ప్రజాపాలన దరఖాస్తులను రెండు, మూడు రోజుల్లో అది కూడా ఒకటి, రెండు స్కీంలను మాత్రమే ఆన్లైన్ చేశారు. దీంతో ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న జీరో కరెంట్ బిల్లు, రూ. 500 గ్యాస్ సబ్సిడీ పథకాలు వేల మందికి రావడం లేదు. ప్రభుత్వం దరఖాస్తులో సవరణలకు అవకాశం ఇవ్వడంతో అధికారుల తప్పిదాలు బయటపడుతున్నాయి.
అప్పుడు జీరో కరెంట్, గ్యాస్ సబ్సిడీకి దరఖాస్తు చేయలేదని, అందుకే రావడం లేదని సిబ్బంది చెబుతున్నారు. మళ్లీ కొత్త దరఖాస్తులు పెట్టుకోవాలంటున్నారు. దీంతో సవరణల కేంద్రాల వద్ద ప్రజలు సిబ్బందితో గొడవకు దిగుతున్నారు. ఎలాంటి అర్హత లేని వారికి ఒక్కో దరఖాస్తుకు రూ.10 చెల్లించి రెండు రోజుల్లో బల్దియా అధికారులు 66 డివిజన్ల నుంచి వచ్చిన దరఖాస్తులను అన్లైన్ చేయించారు. ల్యాప్టాప్లు లేకపోతే మొబైళ్లలో సైతం చేయించారు. ప్రజాపాలన దరఖాస్తుల అన్లైన్ నమోదు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారి చాలా మందికి గ్యారెంటీలు వర్తించడం లేదు. దీనిపై అడిగితే మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తప్పిదంతో 200 యూనిట్ల కంటే తక్కువ కరెంట్ వినియోగించుకున్నా జీరో బిల్లు రావడం లేదని వాపోతున్నారు. సవరణల కోసం వస్తే అధికారుల తప్పిదాలు బయట పడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.