భీమదేవరపల్లి, జూన్ 28: భారత మాజీ ప్రధాని, భారతరత్న పీవీ నరసింహారావు ఆశయాలను ప్రతి ఒక్క రూ కొనసాగించాలని రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని పీవీ స్వగ్రామం వంగరలో 103వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతో కలిసి ఆయన పీవీ విగ్రహానికి పూలమా ల వేసి నివాళులర్పించారు. అనంతరం పీవీ ఇంటి ఆవరణలో నిర్వహించిన జయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పీవీ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టి మైనార్టీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నడిపించారని గుర్తుచేశారు. భూసంస్కరణలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని కొనియాడారు. పీవీ బహుభాషా కోవిదుడని, ఆయనకు 14 భాషలు తెలుసని అందరూ అనుకుంటారని, 15వ భాష కూడా తెలుసునని, అదే మౌనభాష అని చమత్కరించారు. ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పీవీ సలహాలు తీసుకునేవారని తెలిపారు. పార్లమెంట్లో తాము లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేది కాదన్నారు. సోనియాగాంధీ, మీరాకుమారి, సుష్మాస్వరాజ్ వంటివాళ్లతో కలిసికట్టుగా ఉండి రాష్ర్టాన్ని సాధించుకున్నామని వివరించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పీవీ స్వగ్రామం వంగర ఉండడం తన అదృష్టమన్నారు. ఆయనను భావితరాలు స్ఫూర్తి గా తీసుకోవాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్, విశ్రాంత ఆచార్యులు వెంకటనారాయణ, కర్ణకంటి మంజులారెడ్డి, వైస్ ఎంపీపీ మాడుగుల ఎజ్రా, ఎంపీటీసీ నల్ల కౌసల్య, పీవీ మదన్మోహన్రావు, ఆలూరి రజిత, ఆర్ వెంకటరెడ్డి, అదరి రవి, కే రాజు, ఎస్ మొండయ్య, కాజీపేట ఏసీపీ తిరుమల్, తహసీల్దార్ ప్రవీణ్, ఎస్సైలు ఎన్ వెంకటేశ్వర్లు, ఎన్ సాయిబాబు, రాజుకుమార్ పాల్గొన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విభజన హామీలను తక్షణమే నెరవేర్చాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. భీమదేవరపల్లిలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విభజన హామీలను అమలుచేసేలా పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. ఇందుకోసం తమ ఎంపీలు సైతం సహకారం అందిస్తారని తెలిపారు. కేంద్రం నుంచి తమకు రావాల్సిన సహకారాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల వరకే రాజకీయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఉమ్మడి జాబితాలోని అంశాలను పరిష్కరించాలని మంత్రి కోరారు.