భూపాలపల్లి రూరల్, జూలై 1 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి బొగ్గు బ్లాకులను ప్రైవేట్ పరం చేయడానికి చేస్తున్న కుట్రలకు నిరసనగా సోమవారం భూపాలపల్లి ఏరియాలోని బొగ్గు గనులపై టీబీజీకేఎస్ నాయకులు, కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం బొగ్గు గనుల మేనేజర్లకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా టీబీజీకేఎస్ నాయకులు మాట్లాడుతూ ప్రస్తుతం వేలం ప్రక్రియలో ఉన్న శ్రావణపల్లి ఓసీపీ గనితోపాటు కల్యాణిఖని 6 బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకే కేటాయించేలా చూడాలని, బొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియలో సింగరేణి సంస్థ పాల్గొనవద్దని విజ్ఞప్తి చేశారు. కొంతకాలంగా కొత్త బొగ్గు బ్లాకులను సింగరేణి సంస్థకు కేటాయించకపోవడంతో సంస్థ ఉనికికి ప్రమాదం ఏర్పడిందని, 41 వేల మంది ఉద్యోగుల భవిష్యత్ ఆందోళనకరంగా మారిందని తెలిపారు. సింగరేణి సంస్థకు బొగ్గు బ్లాకులను ప్రభుత్వం కేటాయించేలా ఒప్పించాలని మేనేజర్లను కోరారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు నల్లవెల్లి సదానందం, భూపాలపల్లి డివిజన్ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య, నాయకులు గౌరీపతిశర్మ, మల్లారెడ్డి, నరేశ్, మధు, రాంచందర్, రాజేందర్, సురేశ్, రవి పాల్గొన్నారు.