జనగామ, జూన్ 22 (నమస్తే తెలంగాణ) ; నీట్ పేపర్ లీకేజ్పై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. పరీక్షను వెంటనే రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశాయి. ఈమేరకు శనివారం ఉమ్మడి జిల్లాలో నిరసనలు పెల్లుబికాయి. నర్సంపేటలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించగా, జనగామలో విద్యార్థులకు మద్దతుగా సాదిక్ అలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. హనుమకొండలో పీడీఎస్యూ, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు నినాదాలతో హోరెత్తించారు. పేపర్ లీకేజీకి ప్రధాని మోదీ బాధ్యత వహించాల్సిందేనని డిమాండ్ చేయడంతో పాటు నీట్ అవకతవకలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
నీట్ను రద్దు చేయాలని బీఆర్ఎస్వీ నియోజకవర్గ నాయకుడు సదిరం వినయ్భాస్కర్, పట్టణ అధ్యక్షుడు దేవోజు హేమంత్ ఆధ్వర్యంలో నర్సంపేటలోని అమరవీరుల స్తూపం వద్ద రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్ నీట్ అవకతవకలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గవర్నర్ చొరవ తీసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. లేకుంటే టీఆర్ఎస్వీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని హెచ్చరించారు. నీట్తో జనాభా ఎక్కువున్న రాష్ర్టాలకే లాభమని, తక్కువ జనాభా ఉన్న తెలంగాణకు అన్యాయం జరుగుతున్నదన్నారు. తక్షణమే క్యాబినేట్ సమావేశం నిర్వహించి నీట్ నుంచి రాష్ట్రం విత్ డ్రా కావాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు నల్ల రవీందర్, మురహరి రాకేశ్, విష్ణువర్ధన్, ఎర్ర శ్రీకాంత్, బబ్లూ, అజయ్, బో లెమియా, శంకర్, తరుణ్ పాల్గొన్నారు.
సాదిక్ అలీ ఆధ్వర్యంలో ఒకరోజు దీక్ష
నీట్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సాదిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యాయవాది సాదిక్ అలీ విద్యార్థులు, సంఘాలతో కలిసి శనివారం జనగామ ఆర్టీసీ చౌరస్తాలో ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఇది లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన అంశమని, కేంద్రం వెంటనే చర్యలు తీసుకోకుంటే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉద్యమిస్తారని సాదిక్ అలీ హెచ్చరించారు. దీక్షలో హం సాత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మహ్మద్ యాకూబ్ పాషా, విద్యార్థి సంఘా ల నాయకులు అన్వర్, యాకూబ్, ఏఎస్ఎఫ్ఐ నాయకుడు సంపత్, జరసం ప్రతినిధి సాయి, ప్రైవేట్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధి యాకూబ్ అలీ, ఆవాజ్ కమిటీ ప్రతినిధి అజహరుద్దీన్, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధి మారస్ దీప్తి, మైనార్టీ నాయకులు మసి ఉర్ రహమాన్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.
లీకేజీకి మోదీ ప్రభుత్వం బాధ్యత వహించాలి
నీట్ పేపర్ లీకేజీ ఘటనకు కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమే బాధ్యత వహించాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ నరసింహారావు డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండలోని జూనియర్ కాలేజీ వద్ద లీకేజీ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని ప్లకార్డులతో నిరసన చేపట్టారు. నీట్ లీకేజీపై ప్రధాని మోదీ స్పందించాలని, బాధిత విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని, దోషులను కఠినంగా శిక్షించాలని, వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్యూ నాయకులు వై దీపక్ మహేంద్ర, ఏ గోపీచంద్, వీ రాజు, సాయిచరణ్, నాని, గణేశ్, శృతి, అనిత, ప్రణవి, కీర్తిక, కృషిక, అనిత, స్పందన, ప్రియ, ఊర్మిళ పాల్గొన్నారు.
ఎన్టీఏను రద్దు చేయాలి..
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బాలసముద్రంలో విద్యార్థులతో కలిసి ర్యాలీ తీసి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు స్టాలిన్, మంద శ్రీకాంత్ మాట్లాడుతూ.. నీట్ తరహాలో యూజీసీ నెట్ ఎగ్జామ్లోనూ అవకతవకలు జరిగాయని ముందుగానే పరీక్షను రద్దు చేయడం సిగ్గు చేటన్నారు. కేంద్రం నిర్వహించే పరీక్షల్లో అవకతవకలు, కుంభకోణాలు బయటపడడం మోదీ ప్రభుత్వానికే సాధ్యమని ఎద్దేవా చేశారు. మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వాలకే కేటాయించాలని, నీట్లో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. కార్యక్రమంలో చరణ్, అర్జున్, రామ్, నందిని, కల్యాణ్, రమ్య, ప్రవళిక, అనూష, సందీప్, చరణ్, రాజకుమార్, నితిన్, వైష్ణవి పాల్గొన్నారు.