హనుమకొండ చౌరస్తా, జూలై 3: నిట్ బీటెక్ ఈసీఈ విద్యార్థికి క్యాంపస్ సెలక్షన్లో భారీ ఆఫర్తో ఉద్యోగం వరించింది. పంజాబ్లోని లుథియానాకు చెందిన రవిషాకు రూ. 88 లక్షల వార్షిక ప్యాకేజీ లభించింది. ఈ మేరకు బుధవారం ప్లేస్మెంట్స్కు సంబంధించిన వివరాలు నిట్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్ సుబుధి వెల్లడించారు. 2023-24 విద్యాసంవత్సరానికి 82 శాతం మంది బీటెక్, 76 శాతం ఎంటెక్, ఎంసీఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ విద్యార్థులు ప్లేస్మెంట్ను సాధించారన్నారు. ఈ ఏడాది రిక్రూట్మెంట్ ప్రక్రియలో 250కి పైగా ప్రైవేట్ కంపెనీలు, 10 ప్రభుత్వరంగ సంస్థలు పాల్గొన్నాయని, అర్హత సాధించిన 1483 మంది విద్యార్థుల్లో 1128 మంది విద్యార్థులు ఉద్యోగ ఆఫర్లను పొందారని చెప్పారు. బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విద్యార్థి రవిషా సంవత్సరానికి అత్యధికంగా రూ. 88 లక్షల ప్యాకేజీని, మరో 12 మంది విద్యార్థులు రూ.68 లక్షల ప్యాకేజీని పొందారని తెలిపారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పనిచేస్తున్న కంపెనీల నుంచి అత్యధిక ప్యాకేజీ ఆఫర్లు విద్యార్థులకు అందాయని, ఈ సంవత్సరం సగటు ప్యాకేజీ 15.6 లక్షలు ఉందన్నారు.
పెద్ద కంపెనీలో రూ.88 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం రావడం ఐ యామ్ వేరీ హ్యాపీ. మాది పంజాబ్లోని లుథియానా. మా తండ్రి బిజినెస్మెన్, తల్లి గృహిణి. వరంగల్ నిట్లో చాలా మంచి వాతావరణం ఉంది. సీనియర్ల మార్గదర్శకత్వం సహాయపడింది. పాఠ్యాంశాలు చాలా సహాయకారిగా ఉన్నాయి. ప్రొఫెసర్ల నుంచి మద్దతు లభించింది. క్యాంపస్కు పెద్దపెద్ద కంపెనీలు వచ్చి బిగ్ ఆఫర్ ప్రకటిస్తున్నాయి.