హనుమకొండ, జూన్ 28 : భూ సంస్కరణల చట్టం తీసుకొచ్చిన ఘనత దివంగత మాజీ ప్రధాన మంత్రి పీవీ నర్సింహారావుదని ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. పీవీ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం హనుమకొండ బస్స్టేషన్ సమీపంలో మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాస్కర్తో కలిసి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వినోద్కుమార్ మీడియాతో మాట్లాడుతూ కెప్టెన్ లక్ష్మీకాంతారావు సొంతంగా హనుమకొండలో పీవీ విగ్రహం ఏర్పాటు చేయగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ మార్గ్లో మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పెద్ద విగ్రహం ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. పీపీ నర్సింహారావు ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశానికి గొప్ప పునాది వేసిన మహనీయుడని ఆయన కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు భూ సంస్కరణల చట్టం తీసుకువచ్చారన్నారు. ఆ సమయంలో ఆ చట్టం అమలు చేయడం హర్షణీయమన్నారు.
అయితే ఆదే సమయంలో కాంగ్రెస్ నాయకులంతా కలిసి ఆయనను సీఎం పదవి నుంచి తప్పించారన్నారు. బ్రహ్మానందరెడ్డి సీఎంగా ఉన్నపుడు విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సర్వేల్లో, రాయలసీమ, కోనసీమల్లో రెసిడెన్షియల్ పాఠశాలలు మొట్టమొదట ఏర్పాటు చేసిన ఘనత పీవీదేనన్నారు. ఆ తర్వాత రాజీవ్గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత గ్రామీణ ప్రాంతంలోని పిల్లలకు మంచి విద్యను అందించాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేసిన మహనీయుడు పీవీ నర్సింహారావు అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటికీ అన్ని జిల్లాలో నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. ఇప్పటికైనా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొట్లాడి ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాలను ఏర్పాటు చేస్తేనే తెలంగాణ ప్రాంత బిడ్డ అయిన పీవీ నర్సింహారావుకు నిజమైన నివాళులర్పించిన వారమవుతామని వినోద్కుమార్ పేర్కొన్నారు.