ములుగురూరల్, జూలై 2 : రిటైర్మెంట్ బెనిఫిట్స్ను తగ్గిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మంగళవారం ములుగులోని మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎండీ దావుద్, కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు ఉద్యోగ విరమణ సమయంలో తక్కువ డబ్బులను చెల్లించి ఇంటికి పంపించేలా మెమో 1334ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. టీచర్లకు రూ. లక్ష, ఆయాలకు రూ.50 వేలు చెల్లించి రిటైర్మెంట్ చేస్తున్నామని, 65 ఏళ్లు పూర్తయిన వారు సెంటర్లకు రావాల్సిన అవసరం లేదని జూన్29వ తేదీన ఉత్తర్వులను విడుదల చేయడం అన్యాయమని అన్నారు. రాష్ట్రంలో 65 సంవత్సరాలు పూర్తయిన వారు సుమారు 10వేల మంది ఉన్నారని, గత ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష రిటైర్మెంట్ సమయంలో అందించి పెన్షన్, వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన జీవో నంబర్ 10ని మార్పు చేయకుండా యథావిధిగా అమలు చేయాలని అన్నారు. అంగన్వాడీలు క్యాంపు ఆఫీసును ముట్టడించిన విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క యూనియన్ నాయకులతో ఫోన్లో మాట్లాడారు. సదరు ఉత్తర్వులు తనకు తెలియకుండా వచ్చాయని, తప్పనిసరిగా టీచర్కు రూ.2లక్షలు, ఆయాకు రూ.లక్ష ఇచ్చి రిటైర్మెంట్ చేస్తామని హామీ ఇవ్వడంతో టీచర్లు, ఆయాలు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు గఫూర్, రత్నం ప్రవీణ్, టీ రవి, అంగన్వాడీ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు కే సరోజన, సమ్మక్క, పద్మారాణి, ప్రేమకుమారి, జమునారాణి, రేణుక, వెంకటరమణ, భాగ్యలక్ష్మి, మోక్షారాణి, సరిత, రమాదేవి, విజయలక్ష్మి, అరుణ, రాధిక, రజిత, రుక్మిణి పాల్గొన్నారు.