నెక్కొండ/ఖానాపురం/నర్సంపేటరూరల్/వర్ధన్నపేట/నల్లబెల్లి/రాయపర్తి/గీసుగొండ/పర్వతగిరి/సంగెం, జూలై 3: ఐదేళ్లపాటు ప్రజా సేవకు అంకితమైన ఎంపీటీసీలకు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఎంపీటీసీల పదవీ కాలం ముగియడంతో బుధవారం జిల్లావ్యాప్తంగా మండల పరిషత్ కార్యాలయా ల్లో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా నెక్కొండ ఎంపీడీవో కా ర్యాలయంలో ఎంపీపీ జాటోత్ రమేశ్ అధ్యక్షతన ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ, జడ్పీటీసీ లావుడ్యా సరోజా హరికిషన్, వైస్ ఎంపీపీ కర్పూరపు శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అ ధ్యక్షుడు, ఎంపీటీసీ సంగని సూరయ్య, ఎంపీటీసీ కరీష్మా, బండారి వినయకుమారి మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఐదేళ్లపాటు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలందించామని, ప్రజా సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావడం సంతోషంగా ఉందన్నారు. ఇకముందు కూడా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంపీవో వీరేశ్, ఈజీఎస్ ఏపీవో జాకబ్, మండల పరిషత్ ఉద్యోగులు అరుణ, ఈజీఎస్ ఉద్యోగులు ఎంపీటీసీ సభ్యులను ఘనంగా సన్మానించారు. ఖానాపురంలో ఎంపీపీ ప్రకాశ్రావుతోపాటు వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, ఎంపీటీసీలు, జ డ్పీటీసీ బత్తిని స్వప్న, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ మస్తాన్ను కార్యాలయ ఉద్యోగులు సత్కరించారు. ఐదేళ్ల పదవీ కాలంలో సహకరించిన ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులకు ఎంపీపీ కృతఙ్ఞతలు తెలిపారు.
అలాగే, నర్సంపేటలో ఎంపీడీవో అంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మోతె కళావతి, జడ్పీటీసీ కోమాండ్ల జయ, ఎంపీటీసీలను అధికారులు ఘనంగా సన్మానించారు. అనంతరం వారు గ్రామాల అభివృద్ధికి అందించిన సేవలను కొనియాడారు. వర్ధన్నపేట రైతు వేదికలో ఎంపీడీవో వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఆత్మీయ సమావేశంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు, జడ్పీటీసీ మార్గం భిక్షపతితోపాటు ఎంపీటీసీలను ఘనంగా సత్కరించారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్రా వు హాజరై సభ్యులను అభినందించారు. నల్లబెల్లి మండలంలో ఐదేళ్లపాటు ప్రజాభివృద్ధిలో పాల్గొన్న ఎంపీటీసీ సభ్యులను ఎంపీడీవో నర్సింహమూర్తి అధ్యక్షతన సన్మానించారు. రాయపర్తిలో తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, ఎంపీడీవో సూపరింటెండెంట్ జానకీదేవి ఎంపీటీసీలు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్ను ఘనంగా స న్మానించారు.
గీసుగొండలో చివరి మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన నిర్వహించారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజా సేవ చేసే రాజకీయ నాయకులకు రిటైర్మెంట్ ఉండదన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో భూ నిర్వాసితులకు త్వరలోనే ఇండ్ల స్థలాలు కేటాయించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలను సన్మానించారు. పర్వతగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కమల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. అనంతరం ఎంపీటీసీలకు సన్మానించారు. సంగెం మండలంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రేవూరి పాల్గొని ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీలను ఘనంగా సన్మానించారు.