హద్దులు తొలగించి.. పంటభూమిగా మార్చి.. ఇబ్బందులు పడుతున్న ఆయకట్టు రైతులు రక్షణ చర్యలు చేపట్టాలని వేడుకోలు
నల్లబెల్లి, జూన్ 30: మండలంలోని చెరువు శిఖం భూములను కొందరు దర్జాగా ఆక్రమించుకుంటున్నారు. కాకతీయులు నిర్మించిన గొలుసుకట్టు చెరువులను బీఆర్ఎస్ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకంలో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా మండలంలోని నారక్కపేట శివారులో ఉన్న లచ్చిరెడ్డికుంటను కూడా అభివృద్ధి చేసింది. చెరువు శిఖం ఆక్రమణకు గురికాకుండా స్టెంచ్ కటింగ్ చేసి హద్దులు ఏర్పాటు చేసింది. అయితే, కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో 20.20 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న లచ్చిరెడ్డికుంటలో కొంతమంది రైతులు స్టెంచ్ను తొలగించి సుమారు పదెకరాల శిఖం భూమిని ఆక్రమించుకుని వ్యవసాయ భూమిగా మార్చారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అలాగే, మరికొంత మంది రైతులు ఏకంగా మత్తడిని ధ్వంసం చేయడంతోపాటు చెరువులోకి వర్షపు నీరు చేరే ప్రధాన కాల్వను పూడ్చివేసి పంట పొలంగా మార్చారు. దీంతో చెరువులోకి సరిగా నీరు చేరక వానకాలంలో వరి సాగు చేస్తే పంట ఎండిపోయే పరిస్థితి దాపురించిందని ఆయకట్టు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గోవిందాపూర్ పంచాయతీ పరిధి శంషాబాద్ గ్రామంలోని షాకిరేవుకుంట శిఖం భూమిని సైతం పలువురు రైతులు జేసీబీతో సదును చేసి పంట పొలంగా మార్చేందుకు యత్నిస్తున్నారని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారలు స్పందించి శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేసి, తమకు న్యా యం చేయాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.
ఇరవై ఎకరాల్లో ఉన్న నారక్కపేట శివారులోని లచ్చిరెడ్డికుంట చెరువు శిఖం భూముల్లో కొంత మంది రైతులు పదెకరాలకు పైగా ఆక్రమించుకున్నారు. అలాగే, మత్తడిని ధ్వంసం చేయడంతోపాటు చెరువులోకి వర్షపు నీరు చేరే ప్రధాన కాల్వను అక్రమంగా పూడ్చివేశారు. దీంతో వర్షాకాలంలో చెరువులోకి చుక్కనీరు కూడా వెళ్లే పరిస్థితి లేదు. అధికారులు స్పందించి శిఖం భూముల ఆక్రమణపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
చెరువు శిఖం భూములను ఆక్రమించుకోవడం నేరం. మండలంలోని లచ్చిరెడ్డికుంటతోపాటు సాకిరేవుకుంట శిఖం భూముల ఆక్రమణపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం. అలాగే, స్టెంచ్ కటింగ్ను తొలంగించిన వారిపై కేసులు నమోదు చేస్తాం.
చెరువు శిఖం భూముల ఆక్రమణపై రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల ఆధ్వర్యంలో జాయింట్ సర్వే చేపట్టి శిఖం భూముల ఆక్రమణకు అడ్డుకట్ట వేస్తాం. అంతేకాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే బాధ్యులపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేస్తాం. మత్తళ్లు, పంట కాల్వలు, తూముల ధ్వంసానికి పాల్పడితే ఉపేక్షించం.