కాశీబుగ్గ, జూలై 2 : కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల 2022-23 విద్యా సంవత్సరం నుంచి బీఎస్సీ ఆలైడ్ హెల్త్ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టిందని, ఈ కోర్సుల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థుల చదువులను యూనివర్సిటీ గాలికొదిలిందని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు విమర్శించారు. ఈ మేరకు మంగళవారం విద్యార్థులు యూనివర్సిటీని ముట్టడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు సరైన సిలబస్ ప్రకటించకుండా, నిబంధనలు పట్టించుకోకుండా పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తో యూనివర్సిటీ ఆడుకుంటుందన్నారు. రాష్ట్రంలో మొదటి బ్యాచ్లో పరీక్షలు రాస్తే కేవలం 25 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారని, మిగితా వారంతా ఫెయిల్ అయినట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 700మంది విద్యార్థులతో ముట్టడి కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. గత సంవత్సరమే ప్రభుత్వం ఈ కోర్సును ప్రవేశపెట్టిందని, వసతులు మాత్రం కల్పించలేదన్నారు. పరీక్షకు నెల ముందు సిలబస్ అందించడంతో 97శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయినట్లు ఆరోపించారు. వెంటనే హెల్త్ యూనివర్శిటీ వీసీతోపాటు రాష్ట్ర సర్కారు స్పందించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు సిలబస్ నిర్ణయించి పరీక్షలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కోర్సుకు గుర్తింపు ఇచ్చి, స్కాలర్ షిప్ల మంజూరుతోపాటు హాస్టల్ వసతులను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు దామెర కిరణ్, అశోక్రెడ్డి, స్టాలిన్, మంద శ్రీకాంత్, చుక్క ప్రశాంత్, యారా ప్రశాంత్, లెనిన్ గువేరా, జస్వంత్, పరిమళ, వినోద్కుమార్ పాల్గొన్నారు.