వర్ధన్నపేట, జూన్ 30: పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేసే వారికి న్యాయం జరిగేలా చూడాలని వరంగల్ వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ సిబ్బందికి సూచించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఆయన ఆదివారం వర్ధన్నపేట పోలీస్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఫిర్యాదు చేసేందుకు స్టేషన్కు వచ్చిన మహిళలతో మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్కు వచ్చే వారికి సహకరిస్తూ వారి సమస్యలను పూర్తిగా విని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. అప్పుడే పోలీసులకు ప్రజల్లో గౌరవం పెరుగుతుందన్నారు. అనంతరం స్థానిక ఏసీపీ నర్సయ్య, ఎస్సై ప్రవీణ్తో కలిసి వర్ధన్నపేట అంబేద్కర్ సెంటర్ను పరిశీలించారు. సెంటర్లో వాహనాలు వేగంగా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు నిత్యం రహదారిపై పోలీసు వాహనాలు పెట్రోలింగ్లో ఉండేలా చూడాలన్నారు. పట్టణం, గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.
రాయపర్తి: విధి నిర్వహణలో భాగంగా పోలీసులు ప్రజలందరితో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించడం ద్వారా పోలీస్స్టేషన్కు వచ్చే ఫిర్యాదులు, కేసుల సత్వర పరిష్కారానికి మార్గాలు లభిస్తాయని వెస్ట్జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ అన్నారు. ఆదివారం రాత్రి మండలకేంద్రంలోని పోలీస్స్టేషన్ను వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, సీఐ జీడీ సూర్యప్రకాశ్తో కలిసి సందర్శించారు. స్టేషన్లోని రికార్డులు, రిజిస్టర్లు, కేసుల వివరాలు, సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. విధి నిర్వహణలో పోలీసులు ప్రజలతో స్నేహపూర్వక, సోదరభావంతో మెలగాలన్నారు. మండలంలో నేర ప్రవృతి కలిగిన వ్యక్తులపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా వ్యక్తులపై కఠినంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్సై వడ్డే సందీప్కుమార్, ఏఎస్సై పళ్లకొండ సదానందం, సిబ్బంది బండారి మహేందర్, తూళ్ల సంపత్కుమార్, మహ్మద్ రఫీ పాల్గొన్నారు.