వరంగల్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : భూసేకరణలో అక్ర మాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అవినీతి నిరోదక శాఖ (ఏసీబీ) అధికారులు వరంగల్ రెవెన్యూ డివిజన్ అధికారి (ఆర్డీవో) సిడాం దత్తును అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కుమ్రం భీం అసిఫాబాద్ జిల్లాలో జరిగిన ఈ అక్రమాలపై ఏసీబీ అధికారులు ఆయనను విచారిస్తున్నట్లు సమాచారం. దత్తును ఏసీబీ అధికారులు వరంగల్ ఆర్డీవో కార్యాలయం నుంచి తీసుకెళ్లడం రెవెన్యూశాఖలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే.. సిడాం దత్తు ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల ముందు బదిలీపై వరంగల్ ఆర్డీవోగా వచ్చారు. గతంలో ఈయన అసిఫాబాద్ ఆర్డీవోగా పనిచేశారు. ఆ సమయంలో అసిఫాబాద్ పట్టణాన్ని ఆనుకొని ఉన్న జన్కాపూర్ శివారు ప్రాంతం మీదుగా 363 జాతీయ రహదారి నిర్మాణం జరిగింది. ఫలితంగా జన్కాపూర్ శివారులో అప్పటికే రెండు సర్వే నంబర్లలోని భూమిలో సుమారు 15 ఎకరాల్లో వెలిసిన వెంచర్లో లేఅవుట్లకు సంబంధించిన 6.12 ఎకరాలను 363 జాతీయ రహదారి నిర్మాణం కోసం సేకరించినట్లు రెవెన్యూ అధికారులు రికార్డుల్లో పేర్కొన్నారు. ఈ భూమికి పరిహారంగా ప్రభుత్వం నుంచి రూ.4.32 కోట్లు మంజూరయ్యాయి.
సదరు వెంచర్లో రహదారుల నిర్మాణం కోసం వదిలిన స్థలానికి మంజూరైన పరిహారాన్ని స్థానిక గ్రామ పంచాయతీకి ఇవ్వాల్సి ఉండగా, ఈ వెంచర్ చేసిన స్థిరాస్తి వ్యాపారులు అక్రమం గా తీసుకున్నారు. దీనిపై ఫిర్యాదు అందడంతో ప్రభుత్వం విచారణ చేపట్టింది. ధరణి పోర్టల్లో వ్యాపారుల పేర్లు ఉండడం వల్ల పరిహా రం పక్కదారి పట్టినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. అంతేకాదు.. వెంచర్లో ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులకు సైతం పరిహారం అందినట్లు తెలిసింది. స్థిరాస్తి వ్యాపారులకు అయాచితంగా ప్రభుత్వం నుంచి పరిహారం డబ్బు అందేలా ఆ సమయంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు సహకరించినట్లు సర్కారు దృష్టికి వ చ్చింది. ప్రతిఫలంగా వ్యాపారుల్లో ఒకరి వద్ద పనిచేసిన డ్రైవర్ బ్యాం కు ఖాతాలో జమ అయిన రూ.1,15,19,000 నుంచి ఆర్డీవో దత్తు తల్లి మల్కుబాయి ఖాతాలోకి రూ.65 లక్షలు, డిప్యూటీ తహసీల్దార్ మేస్రం నాగోరావు సోదరుడు మేస్రం చత్రుషా ఖాతాలోకి రూ.30 లక్షలు బదిలీ జరిగినట్లు విచారణలో తేలింది. సర్వేయర్ భరత్కు రూ.10 లక్షల నగదుతోపాటు రూ.2 లక్షల విలువైన ద్విచక్ర వాహనాన్ని స్థిరాస్తి వ్యాపారులు కొనుగోలు చేసి ఇచ్చారని వెలుగులోకి వచ్చింది. నిందితుల బ్యాంకు స్టేట్మెంట్లు, స్థిరాస్తి వ్యాపారి డ్రైవర్ వాంగ్మూలాన్ని విచారణ అధికారులు నమోదు చేశారు.
సీఎం రేవంత్రెడ్డి శనివారం వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే. హనుమకొండ కలెక్టరేట్లో సీఎం నిర్వహించిన సమీక్షలో పాల్గొన్న ఆర్డీవో దత్తు అనంతరం తన కా ర్యాలయానికి వచ్చినట్లు తెలిసింది. సుమారు రాత్రి 7గంటల తర్వా త ఏసీబీ అధికారులు దత్తును అదుపులోకి తీసుకుని తమ వెంట తీసుకెళ్లినట్లు సమాచారం. అసిఫాబాద్ భూసేకరణలో పరిహారం పంపిణీకి సంబంధించిన అక్రమాల్లో ఏసీబీ అధికారులు శనివారం ఆర్డీవో దత్తుతోపాటు ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో డిప్యూటీ తహసీల్దార్ మేస్రం నాగోరావు, వెంచర్ చేసిన వ్యాపారుల్లో ఇద్దరితో కలిపి మొత్తం నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణమూర్తి వెల్లడించారు. ఈ అంశం రెవెన్యూశాఖలో కలకలం రేపింది.