గీసుగొండ, జూలై 1: వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట టెక్స్టైల్ పార్క్లో దక్షిణ కొరియాకు చెందిన యంగ్వన్ వస్త్ర పరిశ్రమ నిర్మాణ పనులను సోమవారం ఆ పరిశ్రమ చైర్మన్ కిహాక్ సంగ్, ప్రెసిడెంట్ మీన్సుక్లీ, వైస్ చైర్మన్ షాజహాన్ (బంగ్లాదేశ్) పరిశీలించారు. వారితో మరో ఐదుగురు ఆ పరిశ్రమ ప్రతినిధులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో నేరుగా టెక్స్టైల్ పార్క్కు చేరుకున్నారు. వారికి టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ సంతోష్కుమార్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. వారు పరిశ్రమ నిర్మాణ పనులు, సెంటర్లో కుట్టుశిక్షణ పొందుతున్న మహిళల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తమ కంపెనీ ఏర్పాటుకు ఎకరాలు కేటాయించిందని, అన్ని రకాల అనుమతులు రాగా, రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో స్థాపించామని తెలిపారు. నిర్మాణ పనులు త్వరలోనే పూర్తిచేసి దుస్తుల తయారీ ప్రారంభించనున్నట్లు చెప్పారు. తమ కంపెనీ స్పోర్ట్స్, డ్రెస్ మెటీరియల్స్, జర్కిన్స్, సూట్స్ తదితర దుస్తులు ఉత్పత్తి చేస్తుందని, ఇందులో 11వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయని, ఇప్పటికే 700 మందికి కంపెనీ కుట్టుశిక్షణ ఇస్తున్నట్లు వివ రించారు. హైదరాబాద్లో సోమవారం సాయంత్రం సీఎం రేవంత్రెడ్డితో సమావేశంలో పూర్తి వివరాలను తెలియజేస్తామన్నారు.