ఖిలావరంగల్, జూలై 1: ప్రజావాణిలో వినతిపత్రాలు సమర్పించేందుకు వరంగల్ కలెక్టరేట్కు బాధితులు తరలివచ్చారు. నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కారం కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం వరంగల్ కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో మొత్తం 132 దరఖాస్తులు రాగా, అందులో 84రెవెన్యూశాఖకు చెందినవే ఉన్నాయి. చెన్నారావుపేట మండలం ఝల్లి, తిమ్మరాయినిపాడ్, ఎల్లాయగూడెం, ఎల్లాయగూడెం కాలనీలోని సర్వే నంబర్ 70లో 96 ఎకరాలను 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న తమకు గతంలోనే పట్టాదారు పాస్బుక్కులు ఇచ్చినప్పటికీ ధరణిలో ఎక్కించలేదని పది మంది రైతులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పర్వతగిరి మండలం రెడ్యా గ్రామం ఇస్లావత్తండాకు చెందిన ఇస్లావత్ వాల్య తన సర్వే నంబర్ 444/4లోని 36గుంటల భూమిని ఇస్లావత్ హస్లీ అనే మహిళ పట్టా చేసుకుందని, తనకు తిరిగి పట్టా చేయాలని కోరగా కోర్టు నుంచి నోటీసులు ఇప్పించిందని, న్యాయం చేయాలని కోరుతూ విన్నవించాడు. నెక్కొండకు చెందిన దుండి కొమ్మాలు తన 2.20 ఎకరాల భూమి ఓ వ్యక్తి రిజిస్ట్రేషన్ చేసుకున్నాడని, పదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశాడు. ఖిలావరంగల్ మండలం ఇన్నర్ రింగ్ బాధితులు మరోసారి కలెక్టర్ను కలిసి ఐదేళ్లుగా నష్టపరిహారం కోసం తిరుగుతున్నామని, న్యాయం చేయాలని కోరారు. శివనగర్కు చెందిన వృద్ధ దంపతులు చెరుకు దశరథం, నర్సమ్మ కరోనా నుంచి ఆసరా పింఛన్ రావడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చెన్నారావుపేట మండలం ఉప్పరపల్లి ప్రైమరీ స్కూల్ నూతన భవన నిర్మాణం అసంపూర్తిగా వదిలేశారని, పాత భవనంలో పెచ్చులూడి విద్యార్థులపై పడుతున్నాయని, పాఠశాల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కలాం ఫౌండేషన్ ప్రతినిధులు ఎండీ భాషమియా, పరికి మధుకర్ కోరారు.
శివనగర్ మైసయ్యనగర్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల నూతన భవనం పూర్తి కాకపోవడంతో కమ్యూనిటీ భవనంలో కొనసాగుతోందని, గతంలో రూ.10లక్షల సీడీపీ నిధులతో చేపట్టిన నిర్మాణ పనులు స్లాబ్ లెవల్ వరకు పూర్తయ్యాయని, మరిన్ని నిధులు కేటాయించి భవనం పూర్తి చేయాలని 35వ డివిజన్ కార్పొరేటర్ సోమిశెట్టి ప్రవీణ్ విన్నవించారు. గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ కాశిబుగ్గ సాయినగర్కాలనీలోని 21 మహిళా సంఘాలకు చెందిన డబ్బులను అధ్యక్షులకు తెలియకుండా ఆర్పీగా పనిచేస్తున్న ఏ లావణ్య డ్రా చేసినట్లు మహిళా సంఘాల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. బ్యాంక్ అధికారులతో కుమ్మక్కై రూ.31,14,590 డబ్బులు తీసుకుందని, అధికారుల సమక్షంలో తీర్మానం చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తీర్మానం తర్వాత మహిళా సంఘాలు వేసిన పొదుపు డబ్బులను కూడా డ్రా చేసిన ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు జీడబ్ల్యూఎంసీలో ఫిర్యాదు చేయాలని సూచించడంతో మహిళా సంఘాల ప్రతినిధులు వెళ్లిపోయారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక క్రిమినల్ న్యాయచట్టాలతోపాటు రైతు కార్మిక చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఎంసీపీఐ(యూ) జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దారపు రమేశ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. కాగా, గ్రీవెన్స్ సెల్లో ప్రజలు సమర్పించిన దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ సత్య శారద అధికారులకు సూచించారు. హైదరాబాద్లో ముఖ్యమంత్రి ప్రజావాణి నుంచి వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిష్కరించి నివేదికలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్ జీ సంధ్యారాణి, డీఆర్డీవో కౌసల్యాదేవి, జడ్పీ సీఈవో రాంరెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
నల్లబెల్లి: నిబంధనలు పాటించని శ్రీవిద్యానికేతన్ పాఠశాల అనుమతి రద్దు చేయాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం నాగరాజ్ సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఆయన మాట్లాడుతూ శ్రీవిద్యానికేతన్ పేరుతో అనుమతి ఉండగా శ్రీఆదర్శవాణి పేరుతో పాఠశాల నడుపుతున్నారని ఆరోపించారు. అధిక ఫీజుల వసూలుతోపాటు పాఠ్య పుస్తకాలను అధిక ధరలకు విక్రయిస్తున్న పాఠశాల అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి జన్ను రమేశ్, సహాయ కార్యదర్శి మార్త నాగరాజ్, గ్రేటర్ వరంగల్ నాయకుడు పోలబోయిన రాజు పాల్గొన్నారు.
వరంగల్: బల్దియా గ్రీవెన్స్కు వినతులు వెల్లువెత్తాయి. సోమవారం కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో నిర్వహించిన గ్రీవెన్స్లో కమిషనర్ అశ్విని తానాజీ వాకడే ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. 40వ డివిజన్ పరిధిలోని చెట్టవారి గడ్డ ప్రాంతంలో స్మార్ట్రోడ్డు పనులను అసంపూర్తిగా వదిలేశారని కార్పొరేటర్ మరుపల్ల రవి కమిషనర్కు ఫిర్యాదు చేశారు. కంకర పోసి వదిలిపెట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. కొద్ది రోజుల్లో బీరన్న బోనాల జాతర ఉందని, రోడ్డు గుంతల మయంగా మారడంతో బోనాలతో వచ్చే మహిళలు ఇబ్బందులు పడుతారని, వెంటనే రోడ్డు పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మున్సిపల్ సివిల్ కాంట్రాక్టర్లకు ప్రతి నెలా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని హనుమకొండ గ్రేటర్ కాంట్రాక్టర్ల అసోషియేషన్ ఆధ్వర్యంలో కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. సీఎంఏ, పట్టణ ప్రగతి, సబ్ ప్లాన్ పనులకు సంబంధించిన బిల్లులను జనరల్ ఫండ్ నుంచి చెల్లించాలని కోరారు. 56వ డివిజన్ పరిమళ కాలనీలో రోడ్ నంబర్ 12ఎఫ్లో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, 20శాతం నిధులను తామే చెల్లిస్తామని, వెంటనే రోడ్డు మంజూరు చేయాలని కాలనీ అభివృద్ధి కమిటీ కమిషనర్కు వినతిపత్రం అందజేసింది. 2వ డివిజన్ పరిధిలోని చింతగట్టు భగత్సింగ్ నగర్లో పైన్లైన్ లేకపోవడంతో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పైప్లైన్ మంజూరు చేయాలని కార్పొరేటర్ లావుడ్యా రవి కమిషనర్ను కోరారు. వరంగల్ కొత్తవాడ శ్మశానవాటికలో విద్యుత్ దహన సంస్కారాలకు చర్యలు తీసుకోవాలని ఇన్నర్వీల్ క్లబ్ ప్రతినిధులు కమిషనర్కు విన్నవించారు. గ్రీవెన్స్ అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ గ్రీవెన్స్లో 81 వినతులు రాగా, టౌన్ప్లానింగ్ విభాగానికి 41, ఇంజినీరింగ్ విభాగం 25, ప్రజారోగ్య విభాగం 6, పన్నుల విభాగానికి 9 వినతులు వచ్చాయన్నారు. గ్రీవెన్స్లో ఎస్ఈలు కృష్ణారావు, ప్రవీణ్చంద్ర, సీఎంహెచ్వో డాక్టర్ రాజేశ్, సిటీ ప్లానర్ వెంకన్న, బయాలజిస్ట్ మాధవరెడ్డి, డీఎఫ్వో శంకరలింగం, టీపీఆర్వో కోలా రాజేశ్కుమార్, డిప్యూటీ కమిషనర్ కృష్ణారెడ్డి పాల్గొన్నారు.