మహదేవపూర్ (మల్హర్), జూలై 3 : అర్హులైన నిరుపేదలకే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బుధవారం మహదేవపూర్, మల్హర్ మండలాల్లో ఆయన పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా మల్హర్ మండలంలోని వల్లెంకుంట గ్రామంలో రూ.12 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదిని, వల్లెంకుంట, కొయ్యూర్, తాడిచర్ల, మల్లారం గ్రామాల్లో రూ.20 లక్షల ఉపాధి హామీ పథకం నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపాన చేశారు. కొయ్యూర్, రుద్రారం రోడ్డు వెడల్పు పనులకు శంకుస్థాపన చేశారు. మహదేవపూర్ మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కలిసి వన మహోత్సవాన్ని ప్రారంభించి మొక్కలు నాటారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న 2,600 మంది విద్యార్థులకు రెండో దశ ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. అనంతరం మహదేవపూర్ మండల కేంద్రంలో పలు సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు చేశారు.
దుద్దిళ్ల శ్రీపాదరావు సమీకృత మండల కార్యాలయాల సముదాయాన్ని, అంబేద్కర్ పార్క్ను ప్రారంభించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీపాదరావు స్మారక స్తూపాన్ని ఆవిష్కరించారు. మండల పరిషత్ కార్యాలయం సమావేశం మందిరంలో ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని ప్రజాప్రతినిధులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు న్యాయం జరిగేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. త్వరలో స్థలం ఉన్న నిరుపేదలు ఇళ్లు కట్టుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఈ సందర్భంగా పలువురు పలు సమస్యలపై మంత్రికి వినతి పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ బన్సోడ రాణీబాయి, జడ్పీటీసీ గుడాల అరుణ, ఎంపీటీసీలు ఆకుతోట సుధాకర్, రేవెళ్లి మమత, చల్లా రమాదేవి, మంచినీళ్ల దుర్గయ్య, పీఏసీఎస్ చైర్మన్ చల్లా తిరుపతిరెడ్డి, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డీఆర్డీవో నరేశ్, డీఎల్పీవో వీరభద్రం, పంచాయతీరాజ్ ఈఈ దిలీప్, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంపీవో ప్రసాద్, ఏపీవో రవీందర్, డీఈ సాయిలు, పలు శాఖల అధికారులు, మండల ప్రత్యేక అధికారి అవినాష్, ఎఫ్డీవో వజ్రారెడ్డి, ఎఫ్ఆర్వో కమల తదితరులు పాల్గొన్నారు.