మహబూబాబాద్, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి రైతుద్రోహి రైతు అని ఎన్నికల ముం దు అందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి, ఇప్పుడు అనేక కొర్రీలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న తీరును రైతులు గమనించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ అన్నారు. ధర్నాలో భాగంగా గురువారం మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ ఎంపీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవితతో కలిసి ఆమె నిరసనలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్యవతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ కోసం రూ.45వేల కోట్లు అవుతుందని ముందు అంచనా వేసి బడ్జె ట్లో కేవలం రూ.26వేల కోట్లు పెట్టారని, ఇప్పుడు రైతు రుణమాఫీ కింద కేవలం రూ.17వేల కోట్లే మాఫీ చేయడమేమిటని ప్రశ్నించారు. ఆధార్ కార్డులో తప్పు ఉందని, రేషన్ కార్డు, ఇంటికి ఒకటి, ఐటీ, ప్రభుత్వ ఉద్యోగం ఉన్న వారికి ఇవ్వబోమని ఇలా రకరకాల కొర్రీలు పెట్టి చాలామంది రైతులకు రుణమాఫీ చేయడం లేదని మండిపడ్డారు. ప్రతి రైతుకు రుణమాఫీ అయ్యేవరకు బీఆర్ఎస్ పోరాటం చే స్తుందని స్పష్టంచేశారు. కేసీఆర్ పాలనలో కేవలం 10 ఏళ్లలో రైతులకు లక్ష కోట్ల వరకు ఇచ్చామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని మాలోత్ కవిత డిమాండ్ చేశారు. అధికారంలోకి రాకముందు అందరికీ రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు ఎగవేశారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రులు తలో మాట మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒక మంత్రి రూ.17 వేల కోట్లు అని, మరో మంత్రి సగం రుణమాఫీ అయిందని, ఇంకో మంత్రి పూర్తిగా రుణమాఫీ చేశామని ఇలా ఎవరికి తోచింది వారు ప్రకటనలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారు తప్ప వాస్తవాలను రైతులకు చెప్పడం లేదని ఆమె విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డి ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని చెప్పి ఇప్పటివరకు చేయలేదన్న విషయం రైతులు గమనించాలని కోరారు. ఒక గ్రామంలో 300 మంది రైతులు ఉంటే కేవలం 30మందికే మాఫీ అయ్యిందని కవిత గుర్తుచేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేసి తీరాలని, లేకపోతే మరిన్ని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్రెడ్డి, వైస్ చైర్మన్ మారినేని వెంకన్న, రాష్ట్ర నాయకులు భరత్ కుమార్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, మురళీధర్రెడ్డి, శీను, అశోక్ పాల్గొన్నారు.