వర్ధన్నపేట, జూన్ 28 : వర్ధన్నపేటలో నకిలీ వరి విత్తనాలు కలకలం సృష్టించాయి. నకిలీని అరికట్టేందుకు అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మార్కెట్లో వాటి క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. వర్ధన్నపేటలోని ఓ ఎరువుల దుకాణంలో రాయపర్తి మండలం తిర్మలాయపల్లి గ్రామానికి చెందిన రైతులు మహేశ్, నాగరాజు వారం రోజుల క్రితం విత్తనాల బస్తాలను కొనుగోలు చేసి మండెకట్టారు. మూడు రోజులైనా మండె రాకపోవడంతో రైతులు వాటిని అదే బస్తాలో నింపి శుక్రవారం దుకాణం వద్దకు తీసుకొచ్చి నిలదీశారు. వ్యాపారి సరైన సమాధానం చెప్పకుండా దాటవేయడంతో రైతులు, స్థానికులతో కలిసి ఆందోళనకు దిగారు. తాము బస్తాకు రూ.950 చెల్లించి కొన్న విత్తనాలు మొలకెత్తకపోవడంతో నష్టపోయామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్న విషయమై ప్రభుత్వం సమగ్రంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన రాయపర్తికి వెళ్తున్న క్రమంలో వర్ధన్నపేటలో రైతుల ఆందోళన గురించి తెలుసుకొని వారితో మాట్లాడారు. మొలకెత్తని ధాన్యాన్ని పరిశీలించి వెంటనే వరంగల్ కలెక్టర్, స్థానిక వ్యవసాయశాఖ అధికారులకు ఫోన్ చేశారు. విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని దయాకర్రావు కోరారు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే రైతులకు నకిలీ విత్తనాలు విక్రయించడం సరికాదన్నారు. ఇందులో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా రైతుల పక్షాన బీఆర్ఎస్ కొట్లాడుతుందని ఎర్రబెల్లి స్పష్టంచేశారు.