కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా తలపట్టిన ‘ప్రజావాణి’ ప్రజలకు పరిష్కారం చూపడం లేదు. ఎంతో ఆశతో కొందరు హైదరాబాద్కు వెళ్లి మరీ గోడు వెల్లబోసుకున్నా కనీస స్పందన లేకపోవడంతో వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. కేవలం దరఖాస్తులు స్వీకరించడమే తప్ప వాటిపై దృష్టి పెట్టకపోవడంతో దిక్కూమొక్కూ లేకుండా పేరుకుపోతున్నాయి. వాటిలో ముఖ్యంగా కీలకమైన రెవెన్యూ శాఖకు సంబంధినవే ఎక్కువ పెండింగ్ ఉండడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి నిర్వహస్తామని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. ప్రకటించినట్లుగానే హైదరాబాద్లో ప్రజావాణి పేరిట ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను మొదలుపెట్టారు. వారం రోజులు హడావుడి చేసి ఆ తర్వాత ఎంపిక చేసిన రోజుల్లోనే ప్రజావాణి నిర్వహిస్తున్నారు. అయితే సమస్యలు పరిష్కారమవుతాయనే ఆశతో హైదరాబాద్కు వెళ్తున్న ఎంతోమందికి ఎలాంటి భరోసా దొరకడం లేదు. దరఖాస్తు ఇచ్చి రావడమే గానీ తమ విజ్ఞప్తి గురించి మళ్లీ ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. హైదరాబాద్లో ఇచ్చిన దరఖాస్తులను ఆయా జిల్లాలకు పంపిస్తుండగా వాటి పరిష్కారం ఎలా ఉన్నదో నివేదికలు పంపాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో దరఖాస్తులు ఇవ్వడమే గానీ ఆ తర్వాత ఏమీ జరగడం లేదు. ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడే రెవెన్యూ శాఖలోని సమస్యలపై ఇచ్చిన దరఖాస్తుల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మంగళవారం, శుక్రవారం హైదరాబాద్లోని సీఎం ప్రజావాణి నిర్వహిస్తున్నది. మంత్రులు, ఉన్నతాధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇక్కడ ఇచ్చిన ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో హనుమకొండ, వరంగల్ జిల్లాల నుంచి రెవెన్యూ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను అధికారులు పట్టించుకోవడం లేదు. రెండు జిల్లాల్లోనూ ఒక్కటంటే ఒక్క దరఖాస్తును పరిష్కరించలేదు. రెవెన్యూ శాఖకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు పూర్తిగా బాధ్యత వహిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఉండే రెవెన్యూ శాఖ సమస్యలపై ఇచ్చిన దరఖాస్తులను కనీసం పట్టించుకోవడంలేదు. హనుమకొండ జిల్లాకు సంబంధించి హైదరాబాద్లోని ప్రజావాణిలో 379 దరఖాస్తులు అందాయి. వరంగల్ జిల్లాకు సంబంధించి 354 దరఖాస్తులను ఇచ్చారు. ఇలా హైదరాబాద్లో ఇచ్చిన దరఖాస్తులను ఆయా జిల్లాలకు పంపించారు. జిల్లాస్థాయిలో వీటిని వర్గీకరించి ఆయా ప్రభుత్వ శాఖలకు పంపించారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల్లోని రెవెన్యూ శాఖ దరఖాస్తులలో ఒక్కటీ పరిష్కారం కాలేదు. ఈ రెండు జిల్లాల్లోని ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు దరఖాస్తులను కనీసం పరిశీలించడం లేదు. మహబూబాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉన్నది. రెవెన్యూ శాఖకు సంబంధించి ఈ జిల్లా నుంచి 235 దరఖాస్తులు ప్రజావాణిలో ఇచ్చారు. 19 దరఖాస్తులనే ఇప్పటివరకు పరిష్కరించారు. 216 దరఖాస్తుల పరిస్థితి ఏమిటనేది ఎవరికీ తెలియని పరిస్థితి ఉన్నది. ఎన్నో ఆశలతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్లో పెట్టిన ప్రజావాణిలో దరఖాస్తులు ఇచ్చినా ఫలితం లేకపోవడంపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
మహబూబాబాద్ రూరల్/ నెల్లికుదురు, జూలై 1 : తమ ఇంటి స్థలాన్ని కబ్జా చేశారని సోమవారం కలెక్టరేట్ ఎదుట నెల్లికుదురు మండలానికి చెందిన ఓ కుటుంబం ప్లకార్డులతో నిరసన చేపట్టింది. బాధితుడు చిరంజీవి మాట్లాడుతూ.. తమ పూర్వీకుల నుంచి వస్తున్న పొలం, ఇంటి స్థలాన్ని తమ బాబాయి నరేందర్ కబ్జా చేశారని అన్నారు. తమకు అన్యాయం జరిగిందని గ్రామంలో అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు వినతిపత్రం అందజేసి, కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టినట్లు తెలిపారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.
కేసముద్రం, జూలై 1 : తమ భూములకు పట్టాలివ్వాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని నారాయణపురం గ్రామ రైతులు సోమవారం హైదరాబాద్లోని సచివాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము అనేక సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నామన్నారు. వ్యవసాయ భూములను సర్వే చేసి ధరణిలో నమోదు చేసే క్రమంలో తండ్రి పేరు అడవి, రైతు పేరు అడవి అని ముద్రించడంతో కొత్త పాస్ పుస్తకాలు రాలేదని తెలిపారు. దీంతో రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ వంటి పథకాలు పొందక ఆర్థికంగా నష్టపోయామని వాపోయారు. అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఆందోళన చేయగా 2022లో ఎంజాయిమెంట్ సర్వే నిర్వహించిందన్నారు. 2023వ సంవత్సరంలో మొత్తం 1827 ఎకరాలకు గాను 700 ఎకరాలకు సంబంధించిన 700 మంది రైతులకు పట్టాలు ఇచ్చారని తెలిపారు. మిగిలిన సుమారు 700 మంది రైతులకు 1127 ఎకరాలకు పట్టాలు ఇవ్వకపోవడంతో రైతు బంధు, రైతు బీమా, రుణమాఫీ రావడం లేదని అన్నారు. రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని భూములకు పట్టాలు ఇవ్వాలని కోరారు. ఆందోళన చేపడుతుండగా పోలీసులు వచ్చి తీసుకువెళ్లారని రైతులు తెలిపారు. రైతులు ధరావత్ రవి, జాటోత్ వెంకన్న, శంకర్, లచ్చు, రాజేశ్, భీమా, దేవ శ్రీను తదితరులు ఉన్నారు.
జనగామ చౌరస్తా, జూలై 1: తన భూమిని కబ్జా చేశారని.. న్యాయం చేయాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోలేదు. దీంతో విసుగుచెందిన జ్యోతి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో సోమవారం జనగామ కలెక్టరేట్లో జరిగే ప్రజావాణికి వచ్చి అక్క డే కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యకు ప్రయత్నించింది. అనుకోని ఘటనతో అక్కడున్న పోలీసులు అడ్డుకొని వెంటనే ఆమెను జిల్లా ప్రధాన దవాఖానకు తరలించగా, కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తన తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన నర్మెట గ్రామ శివారులోని సర్వే నంబర్ 201/బీ/1, 201/బీ/2లోని రెండెకరాల వ్యవసాయ భూమిని అదే గ్రామానికి చెందిన జంగిటి అంజయ్య, మరికొందరు కలిసి కబ్జా చేశారు. ఆ భూమి వద్దకు వెళ్తే సదరు వ్యక్తులు చంపేస్తామని బెదిరిస్తున్నారు. ఈ విషయంలో అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంతో కలెక్టరేట్కు వచ్చి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం జ్యోతి దవాఖానలో చికిత్స పొందుతోంది. కలెక్టరేట్లో జరిగే ప్రజావాణి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అర్బన్ సీఐ ఎల్ రఘుపతిరెడ్డి ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.