హనుమకొండ చౌరస్తా, ఆగస్టు 2 : హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో శుక్రవారం సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సభకు వేలాది మంది ఉపాధ్యాయులు తరలివెళ్లారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన వివిధ కేటగిరీల ఉపాధ్యాయులు 2,888 మందికి తాజాగా పదోన్నతులు కల్పించింది. వీరంతా హైదరాబాద్లో జరిగిన సభకు తరలివెళ్లారు. వరంగల్ రీజియన్లోని 9 డిపోల నుంచి 65 ప్రత్యేక బస్సులను వీరి కోసం ఏర్పాటు చేశారు. హనుమకొండ జిల్లాలో పదోన్నతి పొందిన 451 మంది ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతులు కల్పించారు.
అదేవిధంగా గురుకుల ఉపాధ్యాయులు, ఇతర ఎంఎస్వోల సిబ్బంది 500 మంది ని 10 బస్సుల్లో తరలించారు. వరంగల్ జిల్లాలో 600 మందికిపైగా ఉపాధ్యాయులు 14 బస్సుల్లో, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 365 మంది ఉపాధ్యాయులను 8 బస్సుల్లో, ములుగు జిల్లాలో 246 మంది ఉపాధ్యాయులను 5 బస్సుల్లో, జనగామ జిల్లాలో 554 మంది ఉపాధ్యాయులను 12 బస్సుల్లో, మహబూబాబాద్ జిల్లా నుంచి 623 మంది ఉపాధ్యాయులు 15 బస్సుల్లో సీఎం సభకు తరలివెళ్లారు.
కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ అధికారులు, ఎంఈవోలు, మండల నోడల్ అధికారులు పదోన్నతి పొందిన ఉపాధ్యాయుల జాబితాను రూపొందించి సభకు తీసుకెళ్లారు. ఉపాధ్యాయులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేశారు. టీచర్లంతా సభకు వెళ్లడంతో పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఒకరిద్దరు ఉపాధ్యాయులతో స్కూళ్లను నడిపించారు. ఒకరిద్దరు ఉపాధ్యాయులతో పాఠశాలలను నెట్టుకొస్తున్న వారు కూడా సభకు వెళ్లడంతో విద్యార్థులు ఇంటిబాట పట్టారు. పాఠాలు బోధించే ఉపాధ్యాయులు లేక తరగతి గదుల్లో ఖాళీగా కూర్చున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా సింగిల్ టీచర్ ఉన్న కొన్ని స్కూళ్లకు ముందుగానే సెలవు కూడా ప్రకటించడం విశేషం.