కృష్ణకాలనీ, జూలై 3 : ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి సింగరేణిని ప్రైవేటీకరించొద్దని టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు బడితల సమ్మయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలాన్ని వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం భూపాలపల్లి పట్టణంలోని టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ కార్యాలయం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి, అంబేద్కర్ సెంటర్లో దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ బీజేపీ 60 సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేసి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్కు అప్పగించే కుట్ర చేస్తున్నదన్నారు. బొగ్గు బ్లాకుల వేలాన్ని రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించడం లేదన్నారు. రాష్ట్రం నుంచి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న కిషన్రెడ్డి తెలంగాణలోని శ్రావణపల్లి ఓసీ వేలాన్ని అడ్డుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ సదానందం, సెంట్రల్ నాయకుడు గౌరీపతిశర్మ, దేవరకొండ మధు, రామచందర్, రఘోత్తంరెడ్డి, అవినాష్, మల్లారెడ్డి, నరేశ్ నేత, లక్ష్మణ్, రాజేందర్, సాంబయ్య, వంశీ, సునీల్, మధు, రణదీప్, శ్రీధర్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.