నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న 930పీ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించడం లేదు. హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వరకు ఈ ఎన్హెచ్ పొడవు 234 కిలోమీటర్లు కాగా, మహబూబాబాద్ జిల్లాలో 80 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గౌరెల్లి జంక్షన్-వలిగొండ, వలిగొండ-తొర్రూరు వరకు టెండర్లు పూర్తయి పనులు కొనసాగుతున్నాయి. తొర్రూరు నుంచి బయ్యారం మండలం నామాలపాడు వరకు పనులకు సంబంధించిన డీపీఆర్ను కేంద్ర ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితమే ఆమోదించి నిధులు సైతం కేటాయించింది. టెండర్ల ప్రక్రియను ప్రారంభించినా అది ఇంకా పరిశీలన దశను దాటలేదు. అయితే నిధులు సర్దుబాటు కాక పనులకు కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా బ్రేక్ వేసినట్లు తెలిసింది. దీంతో ఈ రహదారి విస్తరణ ఎప్పుడు మొదలవుతుందో? ఎప్పుడు పూర్తవుతుందో? అన్నది తెలియక మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రజలు నిరాశ చెందుతున్నారు.
మహబూబాబాద్ జిల్లాలోని పెద్దవంగర మండలం వడ్డెకొత్తపల్లి నుంచి బయ్యారం మండలం నామాలపాడు వరకు 80 కిలోమీటర్ల మేర ఎన్హెచ్ 930పీ విస్తరించి ఉంది. ఈ రహదారి గతంలో ఆర్అండ్బీ పరిధిలో ఉండగా, నాలుగేళ్ల క్రితం ఎన్హెచ్ ఆధీనంలోకి వెళ్లింది. గౌరెల్లి జంక్షన్-వలిగొండ, వలిగొండ-తొర్రూరు వరకు రెండు ప్యాకేజీలకు టెండర్లు ముగిసి సైడ్ డ్రైన్లు, బ్రిడ్జిల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తొర్రూరు నుంచి నామాలపాడు (69 కిలోమీటర్లు) వరకు రహదారి విస్తరించేందుకు ఎనిమిది నెలల క్రితమే ఢిల్లీలోని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హైవేస్ డీపీఆర్ను ఆమోదించి రూ. 675.45 కోట్లు కేటాయించగా, ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. అధికారులు మాత్రం విద్యుత్ లైన్లు, చెట్ల తొలగింపు కోసం సర్వే పూర్తి చేశారు.
ఎన్హెచ్ 930పీ రహదారి పూర్తయితే మహబూబాబాద్ జిల్లావాసులకు హైదరాబాద్ ప్రయాణం సాఫీగా సాగనుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, అశ్వాపురం, మణుగూరువాసులకు సుమారు 40 కిలోమీటర్ల దూరాభారం తగ్గనుంది. అలాగే వ్యాపార, వాణిజ్య పరంగా రెండు జిల్లాలు అభివృద్ధి చెందనున్నాయి. ఆర్అండ్బీ అధికారులు పట్టించుకోక, విస్తరణ జరగక ఈ రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదం చోటుచేసుకొని పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
ఎన్హెచ్ 930పీ విస్తరణకు తాత్కాలిక బ్రేక్ పడినట్లు తెలుస్తున్నది. రాష్ర్టానికి సంబంధించి పలు జాతీయ రహదారులను తాత్కాలికంగా పక్కకు పెట్టినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి వర్తమానం పంపించినట్లు సమాచారం. ఈ ఆర్థిక సంవత్సరం నిధులు సర్దుబాటయ్యే పరిస్థితి లేకపోవడంతో టెండర్ల పరిశీలన దశలోనే ఈ రహదారి విస్తరణను నిలిపివేయాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. వచ్చే ఏడాది బడ్జెట్లో నిధులు కేటాయించి రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు సమాచారం. అయితే ఇటీవల సీఎం రేవంత్రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఎన్హెచ్ 930పీ పనులు వేగవంతం చేయాలని కోరిన నేపథ్యంలో విస్తరణ పనుల్లో పురోగతి ఉంటుందా? లేదా? అనేది వేచి చూడాలి.
ఎన్హెచ్ 930పీ విస్తరణ కోసం కసరత్తు పూర్తిచేశాం. జిల్లాలోని తొర్రూరు నుంచి నామాలపాడు (నెహ్రూనగర్) వరకు 68.9 కిలోమీటర్ల జాతీయ రహదారి విస్తరణ కోసం 675.45 కోట్లు కేటాయించారు. మూడు బైపాస్ల కోసం భూ సేకరణ కూడా పూర్తిచేశాం. విస్తరణలో భాగంగా తొలగించాల్సిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, వాటర్ పైప్ లైన్ల నివేదికలు సంబంధిత అధికారుల నుంచి తెప్పించాం. టెండర్ల పరిశీలన పూర్తి కాగానే పనులు ప్రారంభమవుతాయి. రహదారిపై ఉన్న గుంతలకు ఇటీవల ప్యాచ్ వర్కులు చేసి ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా చూశాం.