ఏటూరునాగారం, జూన్ 13 : వానొస్తుందంటేనే ఆ రెండు గ్రామాల్లో ప్రజల్లో భయం మొదలవుతుంది. వరద భారీగా వస్తే రాకపోకలు నిలిచిపోవడమే గాక గతేడాది లాగే వరద గ్రామాన్ని ముంచెత్తితే తమ పరిస్థితి ఏంటనే ఆందోళన వెంటాడుతున్నది. వివరాలిలా ఉన్నాయి. జంపన్నవాగుపై ఏటూరునాగారం మండలం దొడ్ల సమీపంలో నిర్మించిన బ్రిడ్జి గతేడాది భారీ వరదలకు కొట్టుకుపోయింది. దీంతో కొండాయి గ్రామం పూర్తిగా మునిగిపోవడంతో మల్యాల-కొండాయికు రవాణా స్తంభించింది. మేడారం జాతర సందర్భంగా ప్రైవేట్ వాహనాలను చిన్నబోయినపల్లి నుంచి ఊరట్టం వరకు మళ్లించేందుకు వాగుపై తాత్కాలికంగా రూ. 20 లక్షలతో డైవర్షన్ రోడ్డు వేయగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి.
కాగా, ఇటీవలి వర్షానికి మళ్లీ వాగులోకి వచ్చిన వరదతో రోడ్డు చివర్లు కోతకు గురయ్యాయి. నీటి ప్రవాహానికి మట్టి కొట్టుకుపోతుండగా, రోడ్డుపై ఒకచోట చిన్నపాటి గొయ్యి ఏర్పడింది. ఇక భారీగా వరదొస్తే డైవర్షన్ రోడ్డు కూడా కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. అలాగే కొండాయి మునిగిపోతుందని, రవాణా సౌకర్యం నిలిచిపోతుందనే భయం గ్రామస్తుల్లో నెలకొంది. గతేడాది నిత్యావసర సరుకులు, కూరగాయల కోసం పడిన కష్టాలను గుర్తుచేసుకుంటున్నారు. అయితే ముంపు ప్రాంతాల్లోకి ముందస్తుగానే అధికారులు రేషన్, నిత్యావసర సరుకులను నిల్వ చేస్తుంటారు. కానీ ఇప్పటివరకు అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో పాటు తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
కూలిన వంతెన మధ్య నుంచి తాత్కాలిక ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఈఈ వీరభద్రం ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. ఈ వానకాలం ఉపయోగపడేలా 84 అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పుతో పూర్తిగా ఐరన్తో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. నడిచి వెళ్లడంతో పాటు ద్విచక్ర వాహనాలపై ప్రయాణించేందుకు వీలుగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఫుట్ ఓవర్ బ్రిడ్జికి అనుమతి రాగానే పనులు ప్రారంభిస్తామని ఈఈ చెప్పారు.