మహబూబాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): ‘కంచె చేను మేస్తే కాసేవారేరి’ అన్న చందంగా మారింది జిల్లాలో పౌరసరఫరాల సంస్థ అధికారుల తీరు. ఏటా రైతులు సాగు చేసిన ధాన్యాన్ని పౌరసరఫరాల సంస్థ ఆధ్వర్యంలో కొనుగోలు చేసి మిల్లర్లకు పంపిస్తారు. క్వింటాలు ధాన్యానికి మిల్లర్లు 68 కిలోల బియ్యాన్ని తిరిగి పౌరసరఫరాల సంస్థకు అప్పగించాలి. ఇందుకు మిల్లింగ్కు అయ్యే ఖర్చులు కూడా మిల్లర్లకు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఏటా వానకాలం, యాసంగిలో సాగు చేసిన ధాన్యాన్ని మిల్లర్లకు పౌరసరఫరాల సంస్థ అధికారులు కేటాయిస్తారు. ఒక సీజన్లో ఇచ్చిన ధాన్యానికి సంబంధించిన (కస్టమ్ మిల్లింగ్ రైస్) సీఎంఆర్ ఇవ్వకుండా బకాయి ఉంటే, మరుసటి సీజన్లో వచ్చే ధాన్యాన్ని ఆ మిల్లుకు కేటాయించొద్దు. ఇది చూడాల్సిన పౌరసరఫరాల సంస్థ అధికారులు మిల్లర్ల బలహీనతను ఆసరాగా చేసుకున్నారు. మాకు డబ్బులు ఇస్తే సీఎంఆర్ బకాయి ఉన్నా ధాన్యం కేటాయిస్తామని అవినీతికి తెరలేపారు. లారీ లోడ్కు మామూళ్లు పుచ్చుకొని మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించారు. కేసముద్రంలో మూడు మిల్లులకు కేటాయించిన రూ.30 కోట్ల ధాన్యం సీఎంఆర్ పెట్టడం లేదని అధికారులు ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు.
ఈ మిల్లులు గత మూడు సంవత్సరాలుగా బకాయి ఉంటే వసూలు చేయని అధికారులు ఇప్పుడు హడావుడిగా తనిఖీలు నిర్వహించి సీఎంఆర్ పెట్టడం లేదని ప్రకటనలు చేశారు. ఇదంతా అధికారులకు తెలిసినా ఇన్ని రోజులు ఎందుకు తెలియనట్టు నటించారనేది వెయ్యి డాలర్ల ప్రశ్న. ఇంకా జిల్లాలో చాలా మంది మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకున్నా అటువైపు అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఏటా జిల్లాలో వానకాలం, యాసంగిలో సేకరించిన ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తారు. వానకాలంలో వచ్చిన ధాన్యం రా రైస్, యాసంగిలో సాగు చేసిన ఎక్కువగా బాయిల్డ్ మిల్లులకు కేటాయిస్తారు. జిల్లాలో మొత్తం 33 మిల్లుల వరకు ఉన్నాయి. రెండు సంవత్సరాల నుంచి మిల్లర్లు సీంఎఆర్ ఇవ్వకున్నా అధికారులు ఎందుకు చోద్యం చూశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. మిల్లర్లతో మిలాఖత్ అయి అధికారులు వారికి వంత పాడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మిల్లు యజమాని పాత సీఎంఆర్ ఇవ్వనప్పుడు అతడికి కొత్తగా ధాన్యం ఇవ్వకూడదనే నిబంధన ఉంది. ఒకవేళ జిల్లాలో మిల్లర్లు చాలామంది సీఎంఆర్ పెట్టకుండా ఉంటే, ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని ఇతర జిల్లాలోని మిల్లర్లకు ధాన్యాన్ని కేటాయించాలి. ఇక్కడ అధికారులు ఆ నిబంధనను కూడా తుంగలోతొక్కారు. ఇప్పటికైనా కలెక్టర్ స్పందించి మిల్లర్లతో మిలాఖత్ అయిన అధికారులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.