Viral news : ఒడిశాలో ఓ యువతి పుర్రెలో మంత్రగాడు ఏకంగా 77 సూదులు గుచ్చిన ఘటన ఇటీవల సంచలనం రేపింది. ఈ ఘటనతో భరించలేని తలనొప్పికి గురైన యువతి తాజాగా ఆస్పత్రిలో చేరింది. పరీక్షించిన వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆమె పుర్రెలోని సూదులను విజయవంతంగా తొలగించారు. బుర్లాలోని వీర్ సురేంద్ర సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రిసెర్చ్ (VIMSAR) లోని వైద్యులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఆమె పుర్రెలోంచి మొత్తం 77 సూదులను తొలగించారు.
ఒడిశా రాష్ట్రం బాలింగీర్ జిల్లాకు చెందిన రేష్మా బెహెరా అనే 19 ఏళ్ల యువతి గతంలో అనారోగ్యానికి గురైంది. దాంతో కుటుంబసభ్యులు ఆమెను ఓ మంత్రగాడి దగ్గరికి తీసుకెళ్లారు. తాంత్రిక విద్యలు తెలిసిన సంతోష్ తేజ్రాజ్ రాణా అనే మాంత్రికుడు ఆమె తలలోకి ఏకంగా 77 సూదులను గుచ్చాడు. మూఢ నమ్మకంతో రేష్మా కుటుంబం కూడా అతడిని వారించలేదు.
ఫలితంగా ఆమెకు తీవ్ర తలనొప్పి వచ్చింది. దాంతో కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. గత శుక్రవారం వైద్యులు ఆమెకు సీటీ స్కానింగ్ చేశారు. రిపోర్టు చూసి ఒక్కసారిగా విస్మయం చెందారు. యువతి పుర్రెలో సూదులు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు గంటన్నరపాటు శ్రమించి యువతి తలలోని 77 సూదులను బయటికి తీశారు.
మాంత్రికుడు గుచ్చిన సూదులు మరింత లోపలికి వెళ్లలేదని, దాంతో యువతి మెదడుకు ఏమీ కాలేదని డాక్టర్లు తెలిపారు. కాగా బాధిత కుటుంబసభ్యులు ఫిర్యాదు మేరకు పోలీసులు మాంత్రికుడిని అరెస్టు చేశారు. తాంత్రికం పేరుతో విడతల వారీగా యువతి తలతో సూదులు గుచ్చినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.