మేడ్చల్, జూలై2(నమస్తే తెలంగాణ): అందరు అనుకున్నట్టే అయ్యింది.. ఎందుకైనా మంచిదని జనరేటర్ను ముందే తెప్పించడం మంచిదైంది.. చివరికి ఆ జనరేటరే అక్కరకొచ్చింది.. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని జడ్పీటీసీల పదవీకాలం ముగియడంతో మంగళవారం జడ్పీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు.
జడ్పీ ఛైర్మన్ శరత్చంద్రారెడ్డి అధ్యక్షతన కాసేపట్లో సమావేశం ప్రారంభం అవుతుందనుకున్న సమయంలో కరెంట్ పోయింది. జనరేటర్ను ఆన్ చేసి సమావేశాన్ని ప్రారంభించారు. కాసేపటికి కరెంట్ రావడంతో జనరేటర్ను ఆఫ్ చేశారు. మళ్లీ కరెంట్ పోయింది. ఇక లాభం లేదని జనరేటర్తోనే సమావేశాన్ని నడిపించారు.