హైదరాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు కొనుగోళ్లపై విచారణకు తాము ప్రతిపాదించలేదని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. గురువారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ వారు డిమాండ్ చేస్తేనే కమిషన్ ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యుత్తు కొనుగోళ్లు, యాద్రాద్రి, భద్రాద్రి విద్యుత్తు కేంద్రాలపై సిట్టింగ్ జడ్జి చేత విచారణకు ఆదేశించాలని మాజీమంత్రి జగదీశ్రెడ్డి అసెంబ్లీలో కోరారని గుర్తుచేశారు. కాబట్టే కమిషన్ ఏర్పాటు చేశామని, దీనికి ఇంత రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు. మీరు కమిషన్ వేయడాన్ని తప్పుబడుతున్నారా? జస్టిస్ నరసింహారెడ్డిని నియమించడాన్ని తప్పుబడుతున్నారా? అని ప్రశ్నించారు. జస్టిస్ నరసింహారెడ్డిలో లోపాలు ఏమైనా ఉంటే కమిషన్ వద్దకు వెళ్లి తన అద్భుతమైన వాదన వినిపించే అవకాశం కేసీఆర్కు వచ్చిందని, తెలంగాణ సమాజం కావాలంటే లైవ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి ఏమైనా చెప్పేది ఉంటే తాము కూడా చెబుతామన్నారు. లైవ్ టెలికాస్ట్కు అనుమతించాలని కమిషన్ను కూడా రిక్వెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. తన అనుభవాన్ని, అద్భుతమైన వాదనా పటిమను కేసీఆర్ వినిపించవచ్చని చెప్పారు.
పునర్విభజన చట్టం ప్రకారం రావాల్సిన వాటిపై కేంద్రం నుంచి సాధించుకోవడంలో తమకెలాంటి భేషజాలు లేవని సీఎం పేర్కొన్నారు. అవసరం అయితే ప్రధానిమంత్రిని కూడా కలుస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన హామీలను సాధించడానికి మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. జగన్మోహన్రెడ్డి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు ఢిల్లీలో తెలంగాణ భవన్ సమస్యను పరిష్కరించుకున్నామని గుర్తుచేశారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబుతోనూ మాట్లాడి పరిష్కరించుకుంటామ ని స్పష్టం చేశారు. కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఢిల్లీకి వచ్చి కేంద్ర మంత్రులను కలిశామని చెప్పారు. రైతు రుణమాఫీకి సంబంధించి ఏకకాలంలో రూ. 31 వేల కోట్లు మాఫీ చేయబోతున్నామని వివరించారు.