Telagana Budget : ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు మంజూరు చేశామని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించారు. బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఆయన ప్రసంగించారు. మైనార్టీ వర్గాల హక్కుల పరిరక్షణ, అభివృద్ధితోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమని అన్నారు. మైనార్టీల సంక్షేమం కొరకు ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందన్నారు.
మైనార్టీ విద్యార్థులకు 2024-25లో యూపీఎస్సీ సివిల్ సర్వీస్ పరీక్షలకు ప్రభుత్వం ఉచిత శిక్షణ కార్యక్రమం చేపట్టిందన్నారు. అందుకోసం అనుభవజ్ఞులైన ఆచార్యుల సేవలను వినియోగిస్తున్నామని చెప్పారు. అత్యంత ఆధునిక విధానంలో శిక్షణ ఇవ్వడంతోపాటు లోకల్ అభ్యర్థులకు నెలకు రూ.2,500, నాన్ లోకల్ అభ్యర్థులకు రూ.5,000 చొప్పున స్టైఫండ్ కూడా ఇస్తున్నామన్నారు.
ఈ సంవత్సరం రంజాన్ వేడుకలకు రూ.33 కోట్లు, అషూర్ ఖానాల పునరుద్ధరణకు నిర్వహణకు రూ.50 లక్షలు మంజూరు చేశామని చెప్పారు. ఈ ఏడాది జనవరిలో జరిగిన తబ్లీగీ జమాత్ ఇస్లామిక్ సమావేశానికి రూ.2.40 కోట్లు విడుదల చేశామని, ముస్లిం సోదర సోదరీమణుల హజ్ యాత్రకు రూ.4.43 కోట్లను ఈ నెలలోనే మంజూరు చేశామన్నారు. మైనార్టీ సంక్షేమ శాఖకు ఈ బడ్జెట్లో రూ.3,003 కోట్ల ప్రతిపాదిస్తున్నాని తెలిపారు.