Telangana Budget : ఆరోగ్య శ్రీ పథకం పరిధిని మరింత విస్తరించామని, ఈ పథకం పరిధిలోకి కొత్తగా 163 వ్యాధులను తీసుకొచ్చామని రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఇవాళ సభలో రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పటిష్టపరిచామని, గతంలో రూ.5 లక్షలుగా ఉన్న కవరేజీని ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచామని చెప్పారు.
ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న 1,672 చికిత్సలలో 1,375 చికిత్సలకు ప్యాకేజీ ధరలను సగటున 20 శాతం చొప్పున పెంచినట్లు మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ వైద్య వ్యవస్థ ప్రజా అవసరాలకు ఏమాత్రం సరిపోవడంలేదని అన్నారు. అసంపూర్తిగా ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, ఇతర హాస్పిటల్స్, నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.
ప్రజలందరికీ సకాలంలో నాణ్యమైన ఆరోగ్య సేవలు సమర్థవంతంగా అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సార్వజనిక ఆరోగ్య సంరక్షణ (Universal Health Care) విధానానికి రూపకల్పన చేస్తూ కొన్ని ప్రత్యేక చర్యలు చేపట్టిందని భట్టి విక్రమార్క తెలిపారు. ఆధునిక సాంకేతిక పద్ధతుల ద్వారా ఆరోగ్య సేవలను పౌరులందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో డిజిటల్ ప్రొఫైల్ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పారు.
ఇలా ప్రతి పౌరుడి దగ్గర డిజిటల్ ప్రొఫైల్ కార్డు ఉండటంవల్ల అందరి హెల్త్ హిస్టరీలో వాటిలో నమోదై ఉంటాయని, దాంతో వారికి వైద్య సేవలు అందించడం సులభం అవుతుందని మంత్రి తెలిపారు. దశల వారీగా దంత, నేత్ర, చెవి ముక్కు గొంతు, మానసిక ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖకు ఈ బడ్జెట్లో రూ.11,468 కోట్లు ప్రతిపాదిస్తున్నామని అన్నారు.