Kitex | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): నిన్న ఫాక్స్కాన్.. నేడు కిటెక్స్.. కేసీఆర్ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలు క్రమంగా ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. ఆగస్టు నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు ఫాక్స్కాన్ ఏర్పాట్లు చేస్తుండగా, జూలై చివర్లోనే ట్రయల్ రన్ నిర్వహించేందుకు కిటెక్స్ పరిశ్రమ సన్నాహాలు చేస్తున్నది. ట్రయల్ రన్ విజయవంతమైతే ఉత్పత్తి ప్రారంభిస్తారు. చిన్న పిల్లల బట్టల తయారీకి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ పరిశ్రమ.. బీఆర్ఎస్ ప్రభుత్వ పారిశ్రామిక, స్నేహపూర్వక విధానాలు, కేటీఆర్ పట్టుదలకు ఆకర్షితులై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టింది. దేశంలోని 12 రాష్ర్టాలు, శ్రీలంకను కాదని మన రాష్ర్టానికి రావటం విశేషం. 2021 జూలైలో కిటెక్స్ ఎండీ సాబూజాకబ్ వరంగల్, సీతారాంపూర్ను సందర్శించిన తర్వాత కేటీఆర్తో సమావేశమై రాష్ట్రంలో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెడుతూ 4,000 ఉద్యోగాలు కల్పించనున్నట్టు ప్రకటించారు. దీంతో వారికోసం బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారాంపూర్లో 250, వరంగల్లో 185 ఎకరాలు కేటాయించింది. నీరు, విద్యుత్తు తదితర మౌలిక సదుపాయాలను కల్పించింది.
2021, సెప్టెంబర్లో భూమి పూజ సందర్భంగా తన పెట్టుబడిని రూ.3,000 కోట్లకు పెంచడమే కాకుండా 50వేల ఉద్యోగాలు కల్పిస్తామని కిటెక్స్ ఎండీ వెల్లడించారు. వరంగల్లో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమ జూలై చివర్లో ట్రయల్న్క్రు సిద్ధమవుతుండగా, సీతారాంపూర్లో నిర్మాణం పనులు వేగంగా సాగుతున్నాయి. మొదటి దశలో 12,000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉన్నది. ఈ ఏడాది చివరికల్లా సీతారాంపూర్లో ఉత్పత్తి ప్రారంభించాలని కిటెక్స్ ల క్ష్యంగా పెట్టుకున్నది. వరంగల్ పరిశ్రమలో ఈ ఏడాది మార్చిలోనే ఉత్పత్తి మొదలు పెట్టాలని నిర్ణయించినప్పటికీ విదేశాల నుంచి యంత్రసామాగ్రి రావటంలో జాప్యం వల్ల ఆ లస్యమైందదని పరిశ్రమవర్గాలు తెలిపాయి.
కాటన్ ఉత్పత్తిలో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నది. ఇక్కడి కాటన్ మేలి రకమైనది. మన రాష్ట్రంలో గుజరాత్, తమిళనాడు తరహాలో చెప్పుకోదగ్గ వస్త్ర పరిశ్రమలు, స్పిన్నింగ్ మిల్లులు లేకపోవటం వల్ల ఇక్కడి కాటన్కు తగిన గుర్తింపు రావటం లేదు. ప్రస్తుతం కిటెక్స్ సంస్థ కాటన్ ప్రాసెస్ను మెకనైజ్ చేస్తున్నది. దీంతో పత్తి రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. వరంగల్, సీతారాంపూర్లో పరిశ్రమలు ఉత్పత్తి మొదలుపెడితే రోజుకు 2.2 మిలియన్ల దుస్తులు తయారవుతాయి. ఇవన్నీ అమెరికా మార్కెట్కు ఎగుమతి చేయాలని సంస్థ నిర్ణయించింది. దీంతో రూ.4,000 కోట్ల విదేశీ మారకద్రవ్యం రాష్ర్టానికి వచ్చే వస్తుంది. 50 వేల మంది ఉద్యోగాల్లో దాదాపు 30 వేల ఉద్యోగాలు ప్రత్యక్ష ఉద్యోగాలు కాగా, మిగిలినవి పరోక్ష ఉద్యోగాలు. మొత్తం ఉద్యోగాల్లో 85 శాతం మహిళలనే నియమించాలని సంస్థ నిర్ణయించింది. అలాగే, రైతుల పండించిన కాటన్లో 12-15 శాతం తీసుకోనున్నది.
సీతారాంపూర్లో ప్రపంచంలోనే అతి పొడవైన తయారీ పరిశ్రమ భవనాన్ని నిర్మిస్తున్నారు. 1,350 మీటర్ల పొడవైన మూడు భవనాలు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్లో టెస్లా కంపెనీ ప్రపంచంలో అతి పొడవైన భవనంగా ఉన్నది. టెస్లా భవనం పొడవు 1,160మీటర్లు. అంటే టెస్లా బిల్డింగ్ కన్నా సుమారు 190 మీటర్లు అధిక పొడవైన భవనాన్ని కిటెక్స్ నిర్మిస్తున్నది.
2021లో పరిశ్రమను కేరళ నుంచి బయటకు తరలించాలని కిటెక్స్ సంస్థ నిర్ణయించింది. దీంతో దేశంలోని ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా తదితర 12 రాష్ర్టాలతోపాటు శ్రీలంక కూడా సదరు పరిశ్రమను తమప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆహ్వానించాయి. వారి ఆహ్వానంపై సంస్థ ఎండీ సాబూజాకబ్ ఆయా రాష్ర్టాలను సందర్శించారు. ఈ క్రమంలోనే జూలై 2021లో అప్పటి పరిశ్రమలశాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా వారిని తెలంగాణకు ఆహ్వానించారు. కరోనా లాక్డౌన్ ఉన్నందున తాను రాలేనని చెప్పడంతో ప్రత్యేక ఫ్లైట్ను కేరళకు పంపి ఆయనను రాష్ర్టానికి రప్పించారు.