హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కూరగాయల ధరలు దడపుట్టిస్తున్నాయి. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల మందగమనం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గిపోవడం కూరగాయల దిగుబడులపై తీవ్రంగా ప్రభావం చూపించింది. ఫలితంగా రైతుబజార్లతో పోలిస్తే చిల్లర మారెట్లో ఏకంగా 60 శాతం వరకు ధరలు అధికం కావడం ఆందోళన కలిగిస్తోంది.
సాధారణంగా వేసవిలో కూరగాయల ధరలు పెరుగుతాయి. వర్షాకాలం మొదలవగానే మళ్లీ తగ్గుతుంటాయి. కానీ ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి సీజన్లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరల ధరలు నియంత్రణలోనే ఉన్నాయి. వర్షాకాలం మొదలయ్యాక, వర్షాభావ పరిస్థితుల నడుమ నగరం, పట్టణం, గ్రామం అన్న తేడాలు లేకుండా 20రోజుల వ్యవధిలోనే అమాంతంగా ధరలు పెరిగాయి.
తెలంగాణ జనాభాకు ప్రతి ఏటా 38.54 లక్షల టన్నుల కూరగాయలు అవసరం. ప్రస్తుతం 19.54 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. రాష్ట్రంలో ఒక కోటి 31లక్షల ఎకరాల విస్తీర్ణంలో ప్రధాన ఆహార పంట వరి సహా పత్తి, మొకజొన్న, వేరుశనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కంది, పెసర, ఇతర చిరుధాన్యాలు వంటి అన్ని రకాల పంటలు సాగవుతుండగా, అందులో కూరగాయల పంటలు 3.11లక్షల ఎకరాలకే పరిమితం అయ్యాయి. ఈ కారణంగా సుమారు 19 లక్షల టన్నుల దిగుబడుల కోసం ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ వేసవిలో స్థానికంగా కూరగాయలు ఉత్పత్తి 25 శాతం తగ్గిపోయింది.
ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ మాసాల్లో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, ఈదురు గాలులు కూరగాయలు, ఆకుకూరల తోటలను దెబ్బతీశాయి. హైదరాబాద్ చుట్టూ ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, మహబూబ్నగర్, యాదాద్రి, నల్గొండ తదితర జిల్లాల్లో కూరగాయల దిగుబడులు తగ్గడంతో ఇతర రాష్ట్రాల నుంచి తెస్తున్నారు. ఫలితంగా కూరగాయల ధరలపై రవాణా భారం కూడా పడుతున్నది. జనాభా అవసరాలకు తగ్గట్టుగా కూరగాయల సాగు పెరగాలంటే ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
ఆర్ (రాష్ట్రీయ కృషి వికాస్ యోజన) కింద రైతులకు 50 శాతం రాయితీపై అధిక దిగుబడులు ఇచ్చే హైబ్రీడ్ వంగడాలు, రసాయన ఎరువులను ప్రభుత్వం అందజేసేది. రాయితీలు, రుణాలను ఇచ్చి ప్రోత్సహించేది. వాటిని పునరుద్ధరిస్తే కూరగాయల సాగు పెరుగుతుందని అధికారులు అంటున్నారు.