ముషీరాబాద్, జూన్ 28: ఎస్సీ వర్గీకరణపై రాజకీయ పార్టీల వైఖరికి నిరసనగా వచ్చే నెల 7న మహాదీక్ష చేపట్టనున్నట్టు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ను పరిష్కరించకుండా కాంగ్రెస్, బీజేపీలు 30 ఏండ్లు గా ఓటు బ్యాంకుగా వాడుకొని మాదిగలను మోసం చేశాయని మండిపడ్డారు.
శుక్రవారం హైదరాబాద్ విద్యానగర్లోని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యాలయంలో సంఘం సీనియర్ నేత యా తాకుల భాస్కర్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకొస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పిన బీజేపీ పదేండ్ల పాలనలో మాదిగలను నిలువునా మోసం చేసిందని విమర్శించారు.
ఇటీవల ఎన్నికల సభలో ప్రధాని మోదీ తాను మాదిగల పెద్దన్ననని, వర్గీకరణ బిల్లు పెట్టించే బాధ్యత తననేదని హామీ ఇచ్చారని, బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మాదిగలపై చిన్న చూపు చూస్తుందని, ఇచ్చే పదవులన్నీ మాలలకే ఇస్తుందని తెలిపారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నేతలు పొట్టపెంజర రమేశ్, చిలకమర్రి గణేశ్, బళ్లారి హుస్సేన్, బంగారి శ్రీను, యాదగిరి, కొల్లూరి వెంకట్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.