హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు జిల్లాల్లోనూ వన మహోత్సవం ప్రారంభమైంది. ఇటీవల వరంగల్ జిల్లాలో వన మహోత్సవం లోగోను ఆవిష్కరించి, మొక్క నాటి సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి ప్రారంభించినా క్షేత్రస్థాయిలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయకపోవడంతో ‘నమస్తే తెలంగాణ’లో ‘అయోమయంగా వన మహోత్సం’ శీర్షికన సోమవారం కథనం ప్రచురితమైంది. దీనికి ప్రభుత్వం స్పందించి బుధవారం పెద్దపల్లి, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్ లంకపల్లిలోని గొల్లగూడెం గ్రామంలో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ వన మహోత్సవం కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ ఏడాది వన మహోత్సవంలో ఖమ్మం జిల్లాలో 31లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించారు. మొదటి విడతలో భాగంగా 20 హెక్టార్లలో 33వేల మొకలు నాటాలని నిర్ణయించారు. విద్యార్థులు, యువతతో కలిసి వివిధ జాతులకు చెందిన 400 రకాల మొకలను మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నాటారు.
పెద్దపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే విజయరామణరావుతో కలిసి మొకలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. కరీంనగర్, పెద్దపల్లి, గోదావరిఖని ప్రాంతాల్లో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మొక్కలు నాటారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రావి, వెదురు, యేగిస, మర్రి, నేరేడు, ఎర్రమద్ది, ఉసిరి, చింత, వేప వంటి తదితర 20.25 కోట్ల మొక్కలను ఈ సీజన్లో నాటనున్నారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో అటవీశాఖ ప్రధాన కార్యదర్శి నదీమ్ అహ్మద్, కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ ప్రభాకర్, ఖమ్మం జిల్లా డీఎఫ్వో సిద్దార్థ్ విక్రమ్సింగ్ ఇతర అధికారులు పాల్గొన్నారు. గురువారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు అటవీశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.