Kalyana Lakshmi | కోటపల్లి, జూలై 3 : కల్యాణ లక్ష్మి పథకం లబ్ధిదారుకు అధికారులు చెల్లని చెక్కు ఇచ్చిన ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో బుధవారం జరిగింది. మండలంలోని ఎదుల్లబంధం గ్రామానికి చెందిన జైనేని సరిత-శ్రీనివాస్ దంపతుల కూతురు మేఘన వివాహం 2023 ఫిబ్రవరి 23న జరిగింది. కల్యాణలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోగా.. సరిత పేరిట 2024 ఏప్రిల్ 3న రూ.1,00,116కు సంబంధించిన చెక్కు మంజూరైంది.
ఆ చెక్కును లబ్ధిదారుకు వెంటనే ఇవ్వకుండా మూడు నెలల తర్వాత బుధవారం కార్యాలయానికి పిలిపించుకొని మేఘన తల్లి సరితకు అందజేశారు. చెక్కును మార్చుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన సరిత సిబ్బందికి అందజేయగా, బుధవారంతో చెక్కు గడువు ముగిసిందని వారు తిప్పి పంపించారు. కల్యాణ లక్ష్మి చెక్కు వచ్చి మూడు నెలలవుతున్నా అధికారులు చెప్పలేదని, బుధవారం ఫోన్ చేసి చెల్లని చెక్కు ఇచ్చారని లబ్ధిదారు సరిత, ఆమె కూతురు మేఘన ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై తహసీల్దార్ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు.