హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): దశాబ్దాలపాటు దగాపడ్డ తెలంగాణను రాష్ట్రంగా సాధించి పదేండ్లపాటు కేసీఆర్ అద్భుతంగా పాలించారని, ఒక రకంగా అది తెలంగాణకు స్వర్ణయుగమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. విభజన హామీలు అమలు చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రానికి నివేదించినా ఫలితం లేకుండా పోయిందని, కనీసం ఇప్పటికైనా వాటిని తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పట్టింపులకుపోయి తెలంగాణ ప్రగతిని నిరోధించకూడదని అన్నారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చపై ఆయన బుధవారం రాజ్యసభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని, కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని వివరించారు. తెలంగాణ విజయవంతంగా అమలు చేసిన రైతుబంధు పథకం స్ఫూర్తితో ప్రధాని నరేంద్రమోదీ కిసాన్ సమ్మాన్ నిధిని దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టారని అది తెలంగాణకు ఎంతో గర్వకారణమని తమ నాయకుడు కేసీఆర్ పేర్కొన్న సందర్భాలను ఆయన గుర్తుచేశారు.
తమ రాష్ట్రంలో చేపట్టిన మిషన్ భగీరథ దేశానికి ‘హర్ ఘర్ కీ జల్’ పథకానికి స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. సాగునీటి రంగంలో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచ ఇంజినీరింగ్ అద్భుతాల్లో ఒకటి అని కొనియాడారు. ఐటీ రంగంలో దేశమే గర్వపడేరీతిలో తెలంగాణ అనేక విజయాలు సాధించిందని చెప్పారు. సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని కేసీఆర్ దార్శనిక విధానాలతో నిర్ణయాలు తీసుకోవటం వల్ల పారిశ్రామిక రంగం కొత్తపుంతలు తొక్కిందని తెలిపారు.
ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి అనేక కంపెనీల గమ్యస్థానం హైదరాబాద్ను ఎంచుకున్నాయని వివరించారు. 2014లో రూ. 66,276కోట్లు ఉన్న ఐటీ ఎగుమతులు 2023 నాటికి రూ.2,41, 275కోట్లకు చేరటమే అందుకు నిదర్శనమని తెలిపారు. కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగాన్ని పరిశీలిస్తే తెలంగాణ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరిందో తెలుస్తుందని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులుగా తాము తెలంగాణ ప్రాంత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు పోరాటం చేస్తున్న సందర్భాలను ఆయన గుర్తుచేశారు. కనీసం ఈ టర్మ్లోనైనా విభజన హామీలను మోదీ అమలు చేయాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాజీపేట కోచ్ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం సహా తెలంగాణకు విభజన హామీల్లో భాగమైన ఐఐఎంను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.