Nallagonda | రామగిరి : డీఎస్సీని వాయిదా వేయడంతో పాటు మెగా డీఎస్సీని ప్రకటించాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు పెద్ద సంఖ్యలో నల్లగొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో ఆందోళన చేశారు.
ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆరు నెలలు గడుస్తున్న హామీల్లో స్పష్టత లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ప్రస్తుతం ఉన్న గ్రూప్-2 నోటిఫికేషన్లోనే పోస్టుల సంఖ్యను 2 వేలకు, గ్రూప్-3లో పోస్టుల సంఖ్యను 3వేలకు పెంచాలని డిమాండ్ చేశారు.
మరో వైపు సర్కార్బడుల్లో చాలా ఖాళీలున్నాయని, కొన్ని పోస్టులను మాత్రమే పెంచి డీఎస్సీ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధ్దమైందని దీనిని మూడు మాసాల వరకు వాయిదా వేసి పోస్టుల సంఖ్యను 25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మెగా డీఎస్సీ విడుదల చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. నిరుద్యోగులకు అన్యాయం చేసే జీఓ 46ను తక్షణం రద్దు చేయాలన్నారు. నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తే సర్కార్కు తగిన గుణపాఠం తప్పదని నిరుద్యోగులు హెచ్చరించారు.