Congress | హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): గత ప్రభుత్వ హయాంలో మమ్ములను రోడ్డెక్కించారు.. ఉద్యోగాల కోసం రెచ్చగొట్టారు.. తీరా మీకు ఉద్యోగాలు (పదవులు) రాగానే మమ్మల్ని నడిరోడ్డుపై వదిలేశారు.. మా ఉద్యోగాల సంగతేంటి? అంటూ పాలక కాంగ్రెస్పై నిరుద్యోగ యువత భగ్గుమంటున్నది. అసమగ్ర ఉద్యోగ నియామకాలపై మండిపడుతున్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలుపై సర్కారు నిర్లక్ష్యాన్ని నిరుద్యోగులు నిలదీస్తున్నారు.
రాష్ట్రంలో ఏ నిరుద్యోగిని కదిలించినా గ్రూప్-1 మెయిన్స్కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని, గ్రూప్-2లో 2 వేలు, గ్రూప్-3లో మూడువేల చొప్పున పోస్టులసంఖ్య కు పెంచాలని, డీఎస్సీని వాయిదా వేయాలన్న డిమాండ్లే ప్రధానంగా వినిపిస్తున్నాయి. గతంలో నిరుద్యోగులను పావు గా వాడుకున్న కాంగ్రెస్ ఇప్పుడు రోడ్డుమీదికి తీసుకొచ్చింది. గతంలో నిరుద్యోగులను రోడ్డెక్కించినన నేతలంతా ఇప్పుడు నోరేత్తడంలేదు. ఇక ప్రభుత్వం నుంచి కనీస స్పందనలేదు. మూడు నెలలుగా ప్రభుత్వాన్ని కోరుతున్నా వినతిపత్రాలు ఇస్తున్నా స్పందనే లేదు. దీంతో ఆగ్రహించిన నిరుద్యోగలోకం ఇప్పుడు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధపడింది. కాంగ్రెస్ మోసాలపై భగ్గుమంటున్నది.
అశోక్నగర్కు సీఎం రేవంత్..ఎందుకు రావడం లేదు?
గెలిచిన తెల్లారే అశోక్నగర్కు వస్తా.. మీ సమస్యలు తీరుస్తా.. అన్న సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు ఎందుకు రావడంలేదని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ నేతల దగా, మోసాన్ని ఆలస్యంగా తెలుసుకున్న నిరుద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంపై జంగ్సైరన్ మోగించారు. మరో నిరుద్యోగ ఉద్యమాన్ని ఉర్రూతలూగిస్తున్నారు. ‘నిరుద్యోగుల పక్షాన మేం కొట్లాడాం. కాంగ్రెస్ అధికారంలో వచ్చేందుకు దోహదపడ్డాం.కానీ, ఇప్పుడు మాకే సీఎం అపాయింట్మెంట్ దొరకడం లేదు.. అని ఓ నిరుద్యోగ జేఏసీ నేత తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకసారి గాంధీభవన్కు,మరోసారి సచివాలయానికి, ఇంకోసారి సీఎం ఇంటికి రమ్మని అంటున్నరు. ఇలా రోజుకో చోటుకు తిప్పుకుంటున్నరు తప్ప తమను కలవడం లేదు.. అని తెలిపారు. ‘గతంలో మాతో కలిసినడిచిన నిరుద్యోగులు ఇప్పుడు మమ్మల్ని బండబూతులు తిడున్నరు.. మమ్మల్ని కొట్టేట్టు ఉన్నరు’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని మరో నిరుద్యోగ జేఏసీ నేత అన్నమాటలివి.
మెగా డీఎస్సీ ప్రకటించారని, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు జిల్లాకు ఒకటి, రెండు కూడా లేవని, ఇదేనా మెగా డీఎస్సీ? అంటూ ఆ జేఏసీ నేత ప్రశ్నించారు. రెండురోజుల్లో డిమాండ్లను నెరవేర్చాలని, లేదంటే ప్రత్యక్ష్య కార్యాచరణకు దిగుతామని ఆ నేత హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ పరీక్షల శిక్షకుడు పాలకూరి అశోక్ నిరుద్యోగుల తరఫున ఆమరణ నిరాహారదీక్షకు దిగనున్నట్టు సోమవారం ప్రకటించారు.
Sscc