చిక్కడపల్లి, జూలై4: గ్రూప్ 2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలి. ఆయా పరీక్షలను డిసెంబర్ నెలలో నిర్వహించాలని పలువురు నిరుద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ చైతన్యయాత్ర చేపట్టిన నిరుద్యోగ నేతల ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఆందోళన నిర్వహించారు. ఆ యాత్ర కో ఆర్డినేటర్లు మఠం శివానందస్వామి, ఇంద్ర ప్రసాద్నాయక్ మాట్లాడుతూ తాము నిరుద్యోగ చైతన్యయాత్ర పేరిట రాష్ట్రవ్యాప్తంగా రెండు బస్సుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కీలకపాత్ర పోషించామని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు. ఒక్కో పరీక్షకు వ్యవధి ఉండేలా షెడ్యూల్ మార్చాలన్న తమ వినతి మేరకు నాడు కాంగ్రెస్ నేతగా రేవంత్రెడ్డి కూడా అప్పటి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని తెలిపారు. నేడు ఆయనే సీఎంగా ఉండి ఇప్పుడు డీఎస్సీసీ, గ్రూప్-2 పరీక్షలకు ఒక్కరోజే గడువు ఇచ్చారని విమర్శించారు. నిరుద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నిరుద్యోగులు మహేశ్, ఈశ్వర్, యుగందర్, సలీం, ప్రేమ్కుమార్, నరేశ్, అభినవ్, కాంత్రికుమార్, శివనాయక్ తదితరలు పాల్గొన్నారు.