హైదరాబాద్: నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్నాయక్ (Motilal Nayak) దీక్ష విరమించారు. తొమ్మిదిరోజులుగా గాంధీ దవాఖానలో దీక్ష చేస్తున్న ఆయన కొబ్బరినీళ్లు తాగి దీక్ష విరమించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగుల డిమాండ్ల కోసం గత తొమ్మిది రోజులుగా దీక్ష చేస్తున్నానని చెప్పారు. కేసీఆర్ 9 రోజులు దీక్ష చేస్తే రాష్ట్రం వచ్చింది కానీ.. తాను దీక్ష చేస్తే ఒక్క ఉద్యోగం కూడా పెరుగలేదన్నారు. ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘ఇన్నిరోజులు అన్నపానియాలు లేకుండా ఆమరణ దీక్ష చేశా. తన ఆరోగ్యం సరిగ్గా లేదని, క్రియాటిన్ లెవల్స్ పెరిగి కిడ్నీ, లివర్లు పాడయ్యే పరిస్థితికి వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత నీళ్లు, కరెంటు వచ్చినయ్. 25 నుంచి 35 ఏండ్ల వయస్సు యువత ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొత్త ప్రభుత్వం రాగానే తమ డిమాండ్లు పరిష్కరిస్తామని చెప్పారు. కానీ ఆ దిశగా అడుగులు మాత్రం పడలే. ఈ ప్రభుత్వానికి రాజకీయాలపై ఉన్న దృష్టి విద్యార్థులు, నిరుద్యోగులపై లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో దీక్ష చేస్తానంటే సర్కారు ఒప్పుకోలేదు. మనుషులు చచ్చిపోయినా పట్టించుకోకపోవడం ప్రజాపాలనా?. నా ఫోన్ లాక్కుని ఎవరితోనూ మాట్లాడనీయడం లేదు. డీఎస్సీ రద్దు చేసి.. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వేయాలి. రేపటి నుంచి మా సత్తా ఏంటో చూపిస్తాం. 50 వేల ఉద్యోగాలు ఇచ్చే వరకు ఉద్యమాన్ని తీవ్రం చేస్తాం. ప్రభుత్వం జీవోలను విడుదల చేసే వరకు ఉద్యమిస్తాం. అన్ని పార్టీల వారినీ కలుపుకుని పోతాం. నాకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులందరికీ కృతజ్ఞతలు. మీడియా, సోషల్ మీడియాకు ధన్యవాదాలు’ తెలిపారు.
ఆరోగ్యం క్షీణించడంతో దీక్ష విరమించిన మోతీలాల్
గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు.. అందుకే దీక్ష విరమించి రేపటి నుంచి ప్రత్యక్షంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తానన్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్. pic.twitter.com/JxzjjIR1rZ
— Telugu Scribe (@TeluguScribe) July 2, 2024