బన్సీలాల్పేట్, జూలై 2: ‘ఆమరణ దీక్షతో నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. తొమ్మిది రోజులపాటు ఎలాంటి ఆహారం తీసుకోక క్రియాటిన్ లెవల్స్ పెరిగి, కిడ్నీ, లివర్ దెబ్బతిన్నాయి. శరీరం పూర్తిగా సహకరించని కారణంగా స్వచ్ఛందంగా దీక్ష విరమిస్తున్నా. నా తల్లిపై ప్రమాణం చేసి చెప్తున్న. ఇందులో ఎవరి బలవంతం, ఒత్తిడి లేదు’ అని తెలంగాణ నిరుద్యోగ జేఎసీ నేత మోతీలాల్ నాయక్ స్పష్టం చేశారు. నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గత తొమ్మిది రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన మోతీలాల్ నాయక్ మంగళవారం గాంధీ దవాఖాన వద్ద మీడియా సమక్షంలో కొబ్బరినీళ్లు తాగి దీక్ష విరమణ ప్రకటించారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను ఎవరి ప్రలోభాలకు లొంగలేదని, బయట కొందరు కావాలని తనపై దుష్ర్పచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన దీక్షకు బీఆర్ఎస్, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని, నూరు శాతం నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసమే చేశానని, ఇందులో రాజకీయాలు లేవని ఆయన తేల్చి చెప్పారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలంతా మరోసారి కేసీఆర్ ప్రభుత్వానికే ఓటు వేసి అధికారం ఇవ్వాలని అనుకున్నది నిజమేనని, రాహుల్గాంధీ, రేవంత్రెడ్ది, భట్టి విక్రమార్క లాంటి నాయకులు నిరుద్యోగుల వద్దకు వచ్చి నమ్మబలికారని ధ్వజమెత్తారు.
తాము అధికారంలోకి రాగానే ఏటా రెండు లక్షల ఉద్యోగాలను ఇస్తామని బాండ్ పేపర్పై గ్యారంటీ రాసిచ్చారని తెలిపారు. వారి మాటలు నమ్మి తాము గ్రామాల బాట పట్టి ఇంటింటికీ వెళ్లి తమకు ఉద్యోగాలు రావాలంటే కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేయాలని ప్రచారం చేశామని చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మ్యానిఫెస్టోనే తుంగలోకి తొక్కేసిందని, నిరుద్యోగులను మోసం చేయడమే కాకుండా, చులకనగా చూడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. తాము తలుచుకుంటే ఏం చేయగలమో తెలిసొచ్చేలా సీఎం రేవంత్రెడ్డికి రుచి చూపిస్తామని, లక్షలాది మంది నిరుద్యోగుల శక్తిని ప్రదర్శిస్తామని స్పష్టం చేశారు.
తనను పరామర్శించేందుకు వచ్చిన నిరుద్యోగ, రాజకీయ నేతలను పోలీసులు అరెస్టు చేయడం దారుణమని మోతీలాల్ నాయక్ విమర్శించారు. సోమవారమే పోలీసులు తన సెల్ఫోన్ లాక్కున్నారని, తన కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి నిరుద్యోగులను తన వద్దకు రాకుండా అడ్డుకున్నారని తెలిపారు. తొమ్మిది రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, ఇక పాము కాటు ఎలా ఉంటుందో తెలిసేలా చేస్తామని హెచ్చరించారు. ఉస్మానియా యూనివర్సిటీ, అశోక్నగర్ లైబ్రరీ వద్ద తోటి నిరుద్యోగులను కలిసి, వారితో చర్చించి భవిష్యత్తు ప్రణాళికను ప్రకటిస్తానని వెల్లడించారు.
తెలంగాణలోని 33 లక్షల మంది నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలనే డిమాండ్తోనే తాను దీక్ష చేశానని, వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని మోతీలాల్ తెలిపారు. గ్రూప్1లో మెయిన్స్కు 1:100 చొప్పున ఎంపిక చేయాలని, గ్రూప్2లో రెండు వేలు, గ్రూప్3లో మూడు వేల పోస్టులకు రీనోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డీఎస్సీని వాయిదా వేయాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలని, ఖచ్చితంగా 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని, క్యాలెండర్ను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీక్షా సమయంలో గాంధీ దవాఖానకు వచ్చి తనను కలిసి సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్, గెల్లు శ్రీనివాస్యాదవ్, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, నాయకులు రాణీ రుద్రమ, కాసం వెంకటేశ్వర్లు, వివిధ పక్షాల ప్రతినిధులు ప్రొఫెసర్ గాలి వినోద్కుమార్, బక్క జడ్సన్, సేవాలాల్ సేన అధ్యక్షుడు సంజీవ్నాయక్, బంజారా సేవా సంఘం అధ్యక్షుడు ఇస్లావత్ రాంచందర్నాయక్, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారామ్యాదవ్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులకు, వివిధ నిరుద్యోగ, విద్యార్థి సంఘాల నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
దీక్ష విరమిస్తేనే, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాటలను తాను అంగీకరించలేదని మోతీలాల్ చెప్పారు. గత ఆదివారం రాత్రి తన వద్దకు వచ్చిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాటల్లో స్పష్టత లేదని, దీక్ష విరమిస్తే నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పారని, అందుకు తాను ఒప్పుకోనందున దొడ్డిదారిన వెళ్లిపోయారని తెలిపారు. ముందు దీక్ష విరమిస్తే నిరుద్యోగుల డిమాండ్లను సీఎం రేవంత్రెడ్డి పరిశీలిస్తారని సోమవారం మంత్రి సీతక్క తనతో ఫోన్లో చెప్పారని, తమ డిమాండ్లను అంగీకరించి జీవో విడుదల చేస్తేనే తాను దీక్ష విరమిస్తానని కరాఖండిగా చెప్పానని తెలిపారు.