హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలు -2025 కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్టు గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆదివారం తెలిపారు. హైదరాబాద్లోని రాజేంద్రనగర్ గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో రెసిడెన్షియల్ విధానంలో ఇంటిగ్రేడెట్ గైడెన్స్ శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. దరఖాస్తుల స్వీకరణకు జూలై 7 వరకు గడువు పొడిగించామని తెలిపారు. వివరాలకు http://studycircle.cgg.gov.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
‘పదోన్నతుల్లో ఎస్జీటీ ఖాళీలన్నీ చూపించాలి’
హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): ఎస్జీటీ క్యాటగిరీ ఉపాధ్యాయ ఖాళీలన్నీ బదిలీలకు చూపించాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఖాళీలను పూర్తి స్థాయిలో చూపించకుండా జరిపే బదిలీలు ఎవరి ప్రయోజనం కోసమని ప్రశ్నించింది. షెడ్యూల్లో లేని నిబంధనను ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో మాత్రమే అమలుచేయటం గందరగోళానికి గురిచేస్తున్నదని విమర్శించింది. కోర్టు కేసులను బూచిగా చూపి వేల సంఖ్యలో ఉండే ఎస్జీటీలకు ఆప్షన్ గడువును ఒక రోజే ఇచ్చి హడావుడిగా ముగించాలని చూడటం సమంజసం కాదని వాపోయింది.