మనోహరాబాద్, మే 28 : తప్పుడు పత్రాలతో స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన కేసులో మెదక్ జిల్లా తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ను పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈయనతోపాటు మరో ఎనిమిది మందిని మంగళవారం రిమాండ్కు పంపారు. మనోహరాబాద్ ఎస్సై కరుణాకర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్లోని మోతీనగర్కు చెందిన సురావజ్జుల సత్యనారాయణమూర్తి, అతని భార్య స్వాతికి మనోహరాబాద్ మండలం కూచారం శివారులోని సర్వే నంబర్ 225, 226లో వెయ్యి గజాల స్థలాన్ని హైదరాబాద్కు చెందిన మల్లవరపు అరుణ్కుమార్ విక్రయించాడు.
ఇందుకోసం ఆయన మరో 8 మందితో కలిసి నకిలీ పత్రాలు సృష్టించి రూ.80 లక్షలకు విక్రయించాడు. అప్పటికే ఆ స్థలం దుర్గ పేరిట ఉన్నది. కాగా, నిందితులు.. హైదరాబాద్కు చెందిన లక్ష్మీ అనే మహిళకు డబ్బు ఎర చూపి, ఆమె ఆధార్కార్డును దుర్గగా మార్ఫింగ్ చేసి సురావజ్జుల సత్యనారాయణ మూర్తి, అతని భార్య స్వాతి పేరిట స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేశారు. కొనుగోలు చేసిన వారు లింక్ డ్యాకుమెంట్ల కోసం ఆరా తీయగా, వారు పొంతనలేని సమాధానాలు చెప్పారు.
దీంతో వారు ప్లాటు వద్దకు వెళ్లి చూడగా, వేరే వ్యక్తుల పేరుతో బోర్డు ఉండటంతో తాము మోసపోయామని గ్రహించారు. దీంతో బాధితులు సత్యనారాయణమూర్తి, స్వాతి గత ఏప్రిల్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన ఎస్సై కరుణాకర్రెడ్డి.. గత నెలలో మొదట నలుగురిని, మంగళవారం తూప్రాన్ సబ్ రిజిస్ట్రార్ రమణతోపాటు నలుగురిని మొత్తం 9 మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.