TGPSC | హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల కోసం నిరుద్యోగుల పోరాటం ఉధృతమవుతున్నది. రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు, నిరాహారదీక్షలు చేస్తున్న ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 5న టీజీపీఎస్సీ ముట్టడికి ఉద్యోగార్థులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వేలాది సంఖ్యలో పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డిమాండ్లు నెరవేర్చేందుకు గురువారం వరకు గడువు అని అల్టిమేటం జారీచేశారు. ప్రభుత్వం దిగిరాకుంటే నిరుద్యోగుల ధర్నా తప్పదని హెచ్చరిస్తున్నారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, గ్రూప్-1 మెయిన్స్కు 1:100 నిష్పత్తి అమలు, గ్రూప్ 2, 3, డీఎస్సీలో పోస్టుల పెంపు వంటి డిమాండ్లపై ప్రభుత్వం దిగిరావాలని డిమాండ్ చేస్తున్నారు.
కొనసాగుతున్న దీక్షలు
నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలో కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్, అశోక్ ఇద్దరూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. వారిని హౌస్అరెస్టు చేసినా ఇంటినుంచే దీక్ష కొనసాగిస్తున్నట్టు ప్రకటించారు. ఇద్దరి ఇండ్ల వద్ద పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించారు.
ప్రతి పక్షాలు, విద్యార్థి సంఘాల మద్దతు
ఈ నెల 5న ‘హలో నిరుద్యోగి.. చలో టీజీపీఎస్సీ ముట్టడి’కి బీఆర్ఎస్, ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. నిరుద్యోగులకు అండగా ఉంటామని స్పష్టం చేశాయి. విద్యార్థి, నిరుద్యో గ సమాఖ్య గౌరవాధ్యక్షుడు రాజారామ్ యాదవ్ నిరుద్యోగుల ఉద్యమానికి సం ఘీభావం ప్రకటించారు.