Rain Update | హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం సముద్రమట్టానికి 7.6 కి.మీ ఎత్తులో నైరుతి దిశగా కొనసాగుతుందని పేర్కొన్నది. అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. మరో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఆదివారం భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా ముల్కపల్లేలో అత్యధికంగా 9.12 సెం.మీ, భద్రాచలంలో 7.33 సెం.మీ, జూలూరుపాడ్లో 6.26 సెం.మీ, చంద్రుగొండలో 6.15 సెం.మీ, కొత్తగూడెంలో 5.57 సెం.మీ, చుంచుపల్లిలో 5.32 సెం.మీ, అశ్వాపురంలో 5.51 సెం.మీ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైన్పూర్లో 5.74 సెం.మీ, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో 5.61 సెం.మీ, ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో 6.72 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.
ఈ ఏడాది జూన్ ముగిసేటప్పటికీ 159 మి.మీ. వర్షపాతం నమోదైంది. సోమవారం ఆదిలాబాద్, పెద్దపల్లి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, కొమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, మహబూబాబాద్, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.